బీఫ్ తినకుండా బతకలేరా? పాకిస్థాన్ వెళ్లండి: కేంద్రమంత్రి నఖ్వీ
న్యూఢిల్లీ: పశువధ, పశు మాంసం(బీఫ్) మీద నిషేధం విధించడాన్ని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సమర్థించుకున్నారు. పశుమాంసం తినకుండా బతకలేరా? అని ప్రశ్నించిన ఆయన, బీఫ్ తినాలనుకునే వాళ్లు పాకిస్థాన్ వెళ్లొచ్చని తీవ్రంగా స్పందించారు.
ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇది లాభనష్టాల వ్యవహారం కాదని, నమ్మకానికి సంబంధించిన విషయమని, హిందువులకు అది చాలా సున్నితమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ దేశంలో బీఫ్ మాంసాన్ని అనుమతించేది లేదని తేల్చి చె్పారు.
ఆవు మాంసం తినకుండా ఉండలేని వాళ్లు పాకిస్థాన్, అరబ్, అది లభించే ఇతర దేశాలకు వెళ్లొచ్చని సూచించారు. పలువురు ముస్లింలు సైతం పశుమాంస భక్షణను వ్యతిరేకిస్తారని ఆయన పేర్కొన్నారు.
ముస్లింల వెనకబాటుతనంపై కూడా నఖ్వీ ప్రసంగించారు. వారు చాలాకాలంగా అభివృద్ధికి దూరంగా ఉండిపోయారని, వారికోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు సామాజిక భద్రతా పథకాలను చేపడుతోందని వివరించారు.
ఇది ఇలా ఉండగా, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నఖ్వీ మాటలను ఖండించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పశువధ నిషేధాన్ని విధిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.