బంగ్లా ఖాళీ చేయడం కుదరదు, అది కాన్షీరాం మెమోరియల్: యోగికి మాయావతి లేఖ
లక్నో: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా వచ్చిన ఆదేశాలను తిరస్కరిస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఐదు పేజీల లేఖ రాశారు. ఈ మేరకు బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా సీఎం యోగిని కలిసి లేఖ అందజేశారు.
ప్రస్తుతం తాను ఉంటున్న బంగ్లా 13ఎ మాల్ ఎవెన్యూని జనవరి 13, 2011న బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం మెమోరియల్గా అంకితం చేశారని లేఖలో మాయావతి పేర్కొన్నారు. అంతేకాదు, జీవితకాలం అందులో నివసించేందుకు తనకు అనుమతినిస్తూ అప్పటి ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు.
బంగ్లాలో తనకు కేటాయించిన రెండు గదులను మాత్రమే నివాసం కోసంఉపయోగించుకుంటున్నట్టు మాయావతి లేఖలో తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి మార్గ్లో తనకు ప్రభుత్వం కేటాయించిన భవనాన్ని త్వరలోనే అధికారలకు అప్పగిస్తానని మాయావతి తెలిపారు.
బంగ్లాపై బీఎస్పీ శ్రేణులు స్పందిస్తూ... ఒకవేళ మాయావతి ఆ నివాసాన్ని ఖాళీ చేసినా.. దాన్ని ఎవరికీ కేటాయించకూడదని అభిప్రాయపడుతున్నారు. కాన్షీరాం జ్ఞాపకార్థం దాన్ని అలాగే కొనసాగించాలని అంటున్నారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాసానుసారం.. యూపీ ప్రభుత్వం మాజీ సీఎంలు బంగ్లాలు ఖాళీ చేయాల్సిందిగా ఇటీవల ఉత్తర్వులు జారిచేసిన విషయం తెలిసిందే.