ఆ ఏటీఎంలో రూ. 100కు బదులు రూ. 500: జనం ఎగబడ్డారు, రూ. 1.7లక్షలు డ్రా చేశారు!
బెంగళూరు: అప్పుడప్పుడు ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక లోపాలు, పొరపాట్లు సాధారణమే. కర్ణాటకలోని కొడుగు జిల్లా కేంద్రం మడికేరిలోని ఓ ఏటీఎంలో కూడా తాజాగా ఓ పొరపాటు జరిగింది. దీంతో ఆ ఏటీఎంలో ఎవరైనా నగదును ఉపసంహరించుకుంటే వారికి ఐదు రేట్లు నగదును అందించింది. దీంతో జనాలు ఎగబడి నగదును ఉపసంహరించుకున్నారు. బ్యాంక్ అధికారులకు విషయం తెలిసే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
వివరాల్లోకి వెళితే.. మడికేరిలోని కెనరా బ్యాంకు ఏటీఎంలో ఒకరు వెళ్లి రూ. 500 విత్ డ్రా చేసుకోగా.. అతనికి రూ. 2500 వచ్చాయి. అంటే, రూ. 100కు బదులు 500ల నోట్లు వచ్చాయి. ఈ విషయం స్థానికంగా తెలియడంతో చాలా మంది ప్రజలు వచ్చి ఆ ఏటీఎంలో డబ్బులు తీసుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 1.7లక్షలను డ్రా చేసుకున్నారు.
అయితే, కొందరు ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్యాంకు అధికారులు డబ్బు డ్రా చేసిన వారిని గుర్తించి వారిని సంప్రదించారు. కానీ, తీసుకున్న మొత్తాన్ని కేవలం ఇద్దరు మాత్రమే తిరిగి చెల్లించారు. మిగిలినవారు నగదును తిరిగివ్వడానికి నిరాకరించడం గమనార్హం.
అంతేగాక, అది బ్యాంక్ పొరపాటని తాము ఎందుకు తిరిగివ్వాలని వాదించారు. దీంతో ఏటీఎంలో నగదు నిల్వ చేసే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగడంతో మిగితా వారు కూడా తమ అదనంగా తీసుకున్న డబ్బును తిరిగిచ్చేశారు. దీంతో సంబంధిత అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, నగదు నిల్వ ఉంచే సంస్థ చేసిన పొరపాటువల్లే ఇదంతా చోటు చేసుకోవడం గమనార్హం. రూ. 100 నోట్లు ఉంచవలసిన ట్రేలో రూ. 500 నోట్లను ఉంచింది. దీంతో ఇదంతా జరిగింది.