ఆర్డికల్ 370 రద్దు పట్ల స్పందించిన కాంగ్రెస్..! బీజేపి చర్య రాజ్యాంగ విరుద్ధమన్న ప్రియాంక గాంధీ..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : కశ్మీర్ పై బీజేపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తనదైన శైలిలో స్పందించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదని అభిప్రాయ పడ్డారు. భారతీయ జనతా పార్టీ రెండోసారి అదికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని, రాజకీయ విద్వేషాలతో కూడుకున్న కార్యకలాపాలకు ప్రాధాన్యతనిస్తోందని మండిపడ్డారు.
దేశంలోని ప్రజలందరి మనోభావాలను పరిగణలోకి తీసుకుని ప్రధాన మంత్రి అడుగులు వేయాలని, కొందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మార్పులకు సాహసం చేయరాదని ప్రియాంక గాంధీ తెలిపారు. కశ్మీర్ అంశంలో బీజేపి దుందుడుకు చర్యలకు పాల్పడిందని, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల పర్యవసానాలకు కూడా భారతీయ జనతా పార్టీ బాద్యత వహించాలని ఆమె స్పష్టం చేసారు. ఐతే ఆర్టికల్ 370రద్దు పట్ల కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా స్పందించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాదాన్యతను సంతరించుకున్నాయి. ఆలస్యమైనా ప్రియాంక గాంధీ జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై మౌనం వీడారు. ఆమె మంగళవారం ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో మీడియాతో మాట్లాడుతూ జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు.
సోన్భద్రలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య భూ వివాదం నేపథ్యంలో జరిగిన కాల్పుల సంఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ సోన్భద్రలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధనను నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు. అలాంటి పనులు చేసేటపుడు పాటించవలసిన నిబంధనలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం పాటించలేదని చెప్పారు.