Ayodhya verdict countdown:ఏ క్షణమైనా అయోధ్య తీర్పు.. సెలవుల రద్దు, తాత్కాలిక జైళ్లు..
అయోధ్య భూ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడిస్తోంది. ఈ నెలలో రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనుండటంతో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అత్యంత సున్నితమైన సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
సెలవులు రద్దు
ఇప్పటికే రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు కూడా జారీచేసింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది సెలవులను కూడా రద్దుచేసింది. దీంతోపాటు పాఠశాలలు, కాలేజీలను తాత్కాలిక జైళ్లుగా ఉపయోగిస్తామని స్పష్టంచేసింది. అయోధ్యలో 2.77 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. హిందు సంస్థ నిర్మోహి అకాడా, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, రామ్ లాల్ల మధ్య వివాదం ఉంది.
విభజన.. కానీ
2010లో అలహాబాద్ హైకోర్టు ఈ మూడు సంస్థలకు భూమి విభజిస్తూ తీర్పునిచ్చింది. దానిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మధ్యవర్తిత్వ కమిటీ కూడా నియమించారు. కానీ సమస్యకు పరిష్కారం కనుగొనకపోవడంతో..అక్టోబర్ 16 వరకు 40 రోజులు వాదనలు వినిపించారు. అందరీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత ధర్మాసనం.. తీర్పును రిజర్వ్లో పెట్టింది.
నిఘానీడలో
కేంద్రం, యూపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు ప్రకటనలపై కూడా ఓ కన్నేసి ఉంచాయి. తీర్పు నేపథ్యంలో ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తె అవకాశం ఉంది అని అంచనాలతో తగిన చర్యలు తీసుకుంటున్నారు. యూపీలోని అంబేద్కర్ నగర్ జిల్లాలో 8 కాలేజీలను తాత్కాలిక జైళ్లుగా మలిచారు. యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), స్థానిక నిఘా విభాగం (ఎల్ఐయూ) దళాలను మొహరించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసు, పరిపాలన అధికారుల సెలవులను రద్దుచేశారు. రాష్ట్రంలోని 75 జిల్లాలకు సంబంధించి అధికారుల సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు రద్దుచేశారు.
డేగా కన్ను
దీంతోపాటు సామాజిక మాధ్యమాలపై కూడా డేగా కన్నువేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రసంగాలను ప్రసారం చేసి హింసకు ప్రేరేపిస్తారానే సమాచారంతో అప్రమత్తంగా ఉన్నారు. మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మీరట్లో ముస్లిం మత పెద్దలు ఇమామ్లను కలిశారు. మసీదుల వద్ద ప్రార్థనలు చేసే సమయంలో సోదరులను సంయమనంగా ఉండాలని కోరారు.