కేన్సర్ మందుల ధర 90 శాతం తగ్గింపు..! తొమ్మిది మందుల ధరను తగ్గించిన ఎన్పీపీఏ..!!
చెన్నై/హైదరాబాద్ : కేన్సర్ వ్యాది గ్రస్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపిస్తోంది. కేన్సర్ వ్యాది సోకిన వారి వాడే మందులు, ఇంజక్షన్ లపై భారీగా ధరలను తగ్గించేస్తోంది. కేన్సర్ వ్యాధి బారిన పడి.. చికిత్సకు ఖరీదైన మందులను కొనలేని దుస్థితిలో ఉన్న బాధితులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. కీమోథెరపీ ఇంజక్షన్లు సహా.. కేన్సర్ చికిత్సకు ఉపయోగించే తొమ్మిది రకాల మందుల ధరలను 90 శాతం వరకు తగ్గించాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్ణయించింది. మందుల ధరలు తగ్గిస్తున్నట్లుగా తెలుపుతూ ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వానికి ఎన్పీపీఏ నివేదిక సమర్పించింది.
దీని ప్రకారం.. ఊపిరితిత్తుల కేన్సర్ చికిత్స కీమోథెరపీలో ఉపయోగించే పెమెట్రెక్స్డ్ (500 ఎంజీ) ఇంజక్షన్కు ఇప్పటిదాకా ఉన్న 22 వేల రూపాయల ధర ఏకంగా 2800రూపాయలకు తగ్గనుంది. ఇదే ఇంజక్షన్ 100 ఎంజీ డోస్ ధర 7700 రూపాయలు ఉండగా.. ఇకపై అది 800రూపాయలకే లభించనుంది. ఇక సాధారణ కీమో డ్రగ్ అయిన ఎపిరూబిసిన్ 50 ఎంజీ ధర 2662 రూపాయల నుంచి 960 రూపాయలకి తగ్గనుంది.
వీటితోపాటు ఎర్లోటినిబ్ (ఎర్లోటజ్), ఎవరోలిమస్ (లానోలిమస్) ట్యాబ్లెట్ల ధరలు, లీప్రొలైడ్ ఎసిటేట్ హార్మోనల్ థెరపీ ఇంజక్షన్ వంటి వాటి ధరలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచే కేన్సర్ మందుల ధరలను ఎన్పీపీఏ రెండోసారి తగ్గించడం గమనార్హం.