ఆరని మంటలు, సమాజ్ వాదీలో బాబాయ్, అబ్బాయి ల మధ్య కొనసాగుతున్న ప్రచ్చన్న యుద్దం
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలనే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో అత్యధికంగా అఖిలేష్ యాదవ్ వ్యతిరేకులే ఉన్నారు.
లక్నో:సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సమస్యలు ఇంకా తీరినట్టుగా లేవు. పార్టీలో ఎలాంటి సమస్యలు లేవని ఆ పార్టీ అధినాయకత్వం చెబుతున్నా అంత్రర్గతంగా ఇంకా సమస్యలు ఉన్నట్టుగా కన్పిస్తున్నాయి. త్వరలోనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న విబేధాలు ఆ పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.
సమాజ్ వాదీ పార్టీ నాయకుల మద్య విబేదాలు ఇంకా తొలగిపోయినట్టుగా లేవు పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని ఆ పార్టీ నాయకులు పైకి చెబుతున్నారు. అయితే పార్టీ నాయకులు మద్య విబేదాలు ఉన్నాయని బహిరంగంగా జరుగుతున్న ఘటనలు చెబుతున్నాయి.
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ మద్య కొంత అంతరం పెరిగింది. అయితే కుటుంబంలో కూడ స్పర్థలు వచ్చాయి.అయితే కుటుంబసభ్యుల మద్య విబేదాలు సమసిపోయాయి. పార్టీలో కూడ ఎలాంటి ఇబ్బందులు లేవని ఆ పార్టీ నాయకులు పదే పదే ప్రకటించారు.
వచ్చే ఏడాదిలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్న పార్టీలో నెలకొన్న సమస్యలు పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బాబాయ్ , అబ్బాయ్ మద్య ఇంకా కొనసాగుతున్న విబేధాలు
చాచా నాతో ఉన్నా లేకున్నా , ప్రజలు నాతో ఉన్నారు, అది చాలు అంటూ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించడం ఆ కుటుంబంలో ఇంకా విబేధాలు ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.టిక్కెట్ల పంపకంలో అఖిలేష్ వర్గానికి శివపాల్ యాదవ్ వివక్ష చూపుతున్నారని సిఎం వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. తనకు తెలియకుండానే మాఫియా నుండి రాజకీయాల్లోకి వచ్చిన అతీక్ అహ్మద్ కు టిక్కెట్ ను కేటాయించడాన్ని అఖిలేష్ తప్పుబడుతున్నారు.ఈ విషయమై బాబాయ్ పై సిఎం అఖిలేష్ అసంతృప్తితో ఉన్నారు.
నేర రాజకీయాలకు దూరంగా ఉండే వారికే టిక్కెట్లకు శివపాల్ చెక్
మాపియా సామ్రాజ్యాన్ని విస్తరించిన అతిక్ ను ఉత్తర్ ప్రదేశ్ సిఎం అఖిలేష్ యాదవ్ దగ్గరకు రానివ్వలేదు. గత మాసంలో అలహబాద్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో అతిక్ సిఎంకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తే అఖిలేష్ దూరం పెట్టారు.నేరారోపణలు కల్గినవారికి రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెబుతున్నారు.అయితే ఈ అభిప్రాయానికి భిన్నంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ వ్యవహారిస్తున్నాడని అఖిలేష్ వర్గం అభిప్రాయంతో ఉంది. అతిక్ ను పార్టీలోకి శివపాల్ తీసుకోవడం ఈ ఘటనకు నిదర్శనంగా చెబుతున్నారు.
అఖిలేష్ సన్నిహితులకు చెక్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారికి పార్టీలో, ప్రభుత్వ వ్యవహరాల్లో దూరం పెడుతున్నారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ల కెటాయింపులో కూడ అఖిలేష్ యాదవ్ వర్గీయులుగా ముద్రపడినవారికి చెక్ పెడుతున్నారు. ప్రభుత్వ వ్యవహరాల్లో కూడ అఖిలేష్ యాదవ్ కు సన్నిహితంగా ఉన్న వారిని కూడ దూరంగా పెడుతున్నారు.పార్టీ రజోత్సవాల్లో ముఖ్యమంత్రికి సన్నిహితుడు ఇరిగేషన్ శాఖ సలహదారు ావెద్ అబ్దిని శివపాల్ యాదవ్ కనీసం వేదిక పరిసర ప్రాంతాల్లోకి రాకుండా అడ్డుకోవడం పట్ల అఖిలేష్ సన్నిహితులు ఆగ్రహంతో ఉన్నారు.
మంత్రి పదవులను తొలగించినవారికి టిక్కెట్లు
తన మంత్రివర్గం నుండి తప్పించిన వారికి టిక్కెట్ల కేటాయింపులో శివపాల్ యాదవ్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గత వారం సమాజ్ వాదీ పార్టీ ప్రకటించిన 23 మంది అభ్యర్థుల జాబితాలో అఖిలేష్ వ్యతిరేకులకు పెద్ద పీట వేస్తున్నారు.తన మంత్రివర్గం నుండి తొలగించిన రాజ్ కిషోర్ సోదరుడు బ్రిజ్ కిషోర్ కు శివపాల్ యాదవ్ టిక్కెటు కేటాయించడం అఖిలేష్ కు పుండుమీద కారం చల్లినట్టుగా ఉంది.రాజ్ కిషోర్ సింగ్ బహిరంగంగా అఖిలేష్ పై విమర్శలు గుప్పించారు.
టిక్కెట్ల కేటాయింపును సమీక్షిస్తామంటున్న అఖిలేష్
సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టిక్కెట్ల కేటాయింపు విషయంలో అఖిలేష్ యాదవ్ వ్యతిరేక వర్గీయులకే పెద్ద పీట వేయడం పై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. పోలింగ్ తేదీలు ప్రకటించిన తర్వాత టిక్కెట్లను కేటాయింపు విషయాన్ని పున:సమీక్షిస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనతో పార్టీలో నెలకొన్న విబేదాలు ఇంకా సమసిపోలేదనే అభిప్రాయాలు నెలకొన్నాయి.ఎవరికి వారు తమ వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా బరిలోకి దించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే ఎవరిది పై చేయిగా మారుతోందో చూడాలి.