'భూకంపాలను ముందే పసిగట్టలేం, ప్రపంచంలో ఎక్కడాలేదు'
న్యూఢిల్లీ: భూకంపాల గురించి ముందుగానే తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటి వరకు ఎక్కడా లేదని, ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఇంకా పరిశోధలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోకసభలో చెప్పారు.
ఇటీవల తీవ్రస్థాయిలో వచ్చిన భూకంపానికి నేపాల్లో వాటిల్లిన నష్టం, మన దేశంలోను పలు రాష్ట్రాల్లో కనిపించిన ప్రకంపనలపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిజ్ఞానంలో భారత్ ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోదని, భూకంపాలను ముందుగానే పసిగట్టే సాంకేతికత మాత్రం ఇంత వరకు ఎక్కడా లేదన్నారు.
టీవీ చానల్ పైన ఆరోపణలపై...
రాజ్యసభ సభ్యుల పరువు ప్రతిష్టలను దిగజార్చే తీరులో రాజ్యసభ టీవీ చానల్ గురించి నిరాధారామైన వార్తలు ప్రచురించిన ఒక అంగ్ల దినపత్రికతోపాటు ఒక చానల్పై సభాహక్కుల తీర్మానాన్ని ప్రతిపాదించటానికి అనుమతి ఇవ్వవలసిందిగా రాజ్యసభలోని ప్రతిపక్షాలు సభాధిపతిని డిమాండ్ చేశాయి.
అయితే సభా హక్కుల తీర్మానాన్ని అనుమతించే ముందు ఆ వార్తను క్షుణ్ణంగా పరిశీలించి సభా నియమనిబంధనలకు లోబడి ఒక నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ చైర్మన్ కురియన్ హామీ ఇచ్చారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజ్యసభ చానల్ గురించి పత్రికలో వచ్చిన వార్త గురించి తనకు పూర్తి సమాచారం లేదని, ఆ వార్తను అన్ని కోణాల్లో పరిశీలించి, సభాహక్కుల తీర్మానానికి వీలుందని నిర్ధారించుకున్న తరువాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రాజ్యసభ టీవీపై ఇంతవరకూ 1700కోట్ల రూపాయలు ఖర్చయ్యాయనీ, ఈ ఖర్చుపై కాగ్ తీవ్ర అభ్యంతరాలు లేవదీసిందని ఒక అంగ్ల దినపత్రికలో వచ్చిన వార్త నూటికి నూరు శాతం తప్పని రాజ్యసభ సభ్యులు తెలిపారు. రాజ్యసభ టీవీపై ఇంతవరకూ 137కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయిదన్నారు. అయితే, సభా హక్కుల తీర్మానాన్ని అనుమతిస్తే మీడియా స్వేచ్ఛను హరించినట్లవుతుందా చూసి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.