రాజీవ్ గాంధీ హంతకులను విడిచిపెట్టేది లేదు: సుప్రీం కోర్టుకు కేంద్రం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేసే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు శుక్రవారం తెలిపింది. వాళ్లను విడిచిపెడితే దేశంతో పాటు ప్రపంచానికి తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని పేర్కొంది.
వారిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తిరస్కరించినట్లు కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. కేంద్రం నిర్ణయాన్ని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వానికి వెల్లడించినట్లు తెలిపింది. కేసును విచారించిన సీబీఐ కూడా దోషుల విడుదలను వ్యతిరేకించింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నళిని రాజ్యాంగంలోని 161వ అధికారణ ప్రకారం గవర్నర్ క్షమాబిక్ష కింద తనను విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ హంతకులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు 2016లో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన కేంద్రం వారి విడుదలకు నో చెప్పింది.
1991 మే 21న ఆత్మాహుతి దాడిలో రాజీవ్గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో పెరరివలన్, మురుగన్, శాంతన్, నళిని శ్రీహరన్, రాబర్ట్ పియస్, జయకుమార్, రవిచంద్రన్లను దోషులుగా తేలుస్తూ వారికి కోర్టు మరణశిక్ష విధించింది. అయితే 2014లో వీరి మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
రెండు దశాబ్దాలుగా జైలుశిక్ష అనుభవిస్తున్న రాజీవ్ హంతకులను విడుదల చేయాలని 2014లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై అప్పటి కేంద్రం సుప్రీంను ఆశ్రయించింది. దీంతో కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు అలాంటి నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీం స్పష్టం చేస్తూ తమిళనాడు నిర్ణయాన్ని కొట్టిపారేసింది.
అయితే రాజీవ్ హంతకులను విడుదల చేసేందుకు అంగీకరించాలంటూ 2016లో తమిళనాడు గవర్నమెంటు మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై కేంద్రం స్పందనను అడిగింది సుప్రీం కోర్టు. కేంద్రం తన అభిప్రాయాన్ని కోర్టుకు ఇప్పుడు వెల్లడించింది.