క్రాష్ ల్యాండింగ్ అని ఇప్పుడే ధృవీకరించలేం: ఇస్రో
బెంగళూరు: సాఫ్ట్ ల్యాండింగ్.. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 మిషన్ ను జాబిల్లి మీదికి ప్రయోగించినప్పటి నుంచీ భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను భయాందోళనకు, ఉత్కంఠతకు గురి చేసిన పదం ఇది. చంద్రయాన్-2ను ప్రయోగించడం ఒక ఎత్తయితే.. దాన్ని చంద్రుడి మీదికి అంతే జాగ్రత్తగా దింపడం మరో ఎత్తు. సెకెనుకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీదికి అడుగు పెట్టే సమయంలో వెంట్రుకవాసి పొరపాటు చోటు చేసుకున్నప్పటికీ.. ఫలితం వేరుగా ఉంటుందని శాస్త్రవేత్తలు మొదటి నుంచీ అనుమానిస్తూనే వస్తున్నారు. అందుకే సాఫ్ట్ ల్యాండింగ్ అనేది శాస్త్రవేత్తల మేధస్సుకు సవాలుగా మారింది.
భయపడిందంతా జరిగింది..
చివరికి భయపడినట్టే జరిగింది. సజావుగా చంద్రుడి మీదికి అడుగు పెట్టాల్సిన విక్రమ్ ల్యాండర్ గతి తప్పింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో తన పథాన్ని కోల్పోయింది. నిర్దేశిత మార్గాన్ని వీడింది. దశ, దిశను వీడింది. ఏమైందో.. ఎటు వెళ్లిందో అంతు తెలియ రాలేదు. చంద్రుడి ఉపరితలాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగాన్ని తనకు తానుగా నియంత్రించుకోవాల్సిన విక్రమ్ ల్యాండర్.. ఆ పని చేయలేదు. సెకెనుకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి మీది నుంచి పక్కకు వెళ్లిపోయిందా? లేక.. అంతే వేగంతో.. చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టి ధ్వంసమైందా? అనేది తేలాల్సి ఉంది. దీనికి గల కారణాలను విశ్లేషించాల్సి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
క్రాష్ ల్యాండింగ్ కు అవకాశాలు ఎక్కువ?
చంద్రుడి ఉపరితలాన్ని సమీపిస్తున్న సమయంలో తన వేగాన్ని ఆటోమేటిక్ గా నియంత్రించుకునే వ్యవస్థను విక్రమ్ ల్యాండర్ లో ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఓ కాగితం ముక్క గాలిలోంచి తేలిగ్గా నేలకు వాలిన తరహాలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడే సాఫ్ట్ ల్యాండింగ్ సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు ఇన్నిరోజులూ అభిప్రాయపడుతూ వచ్చారు. దీనికోసం ఎప్పటికప్పుడు చంద్రయాన్-2 మిషన్, విక్రమ్ ల్యాండర్ కు సంకేతాలు పంపిస్తూ వచ్చారు. అయినప్పటికీ.. వారి ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైన విక్రమ్ ల్యాండర్.. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొట్టి ఉండటానికే అవకాశాలు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. క్రాష్ ల్యాండింగ్ అయి ఉంటుందని, దాని ఫలితంగానే 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సజావుగా సాగిన దాని ప్రయాణం.. రెండు సెకెన్ల వ్యవధిలో స్తంభించిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిరాశలో ఇస్రో..
చంద్రుడి దక్షిణ ధృవం వైపు అడుగు పెట్టాల్సిన విక్రమ్ ల్యాండర్ అనూహ్యంగా విఫలం కావడం భారతీయ అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. చంద్రుడి ఉపరితలం మీది నుంచి సరిగ్గా రెండు కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్ పరిభ్రమిస్తున్న సమయంలో ఉన్నట్టుండి సంకేతాలు స్తంభించిపోయాయి. సంకేతాలు అందుతాయని చాలాసేపటి వరకు శాస్త్రవేత్తలు ఎదురు చూసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. నిర్దేశిత గడువు కంటే సుమారు 40 నిమిషాల పాటు ల్యాండర్ నుంచి ఏవైనా సంకేతాలు అందుతాయేమోనని ఆశగా వేచి చూశారు. ఎలాంటి సందేశాలు గానీ, అంకెలు గానీ లభించలేదు. దీనితో ప్రయోగం విఫలమైనట్లు ప్రకటించారు.
2.1 కిలోమీటర్ల ఎత్తులో..
చంద్రుడి ఉపరితలం మీది నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయినట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు. ల్యాండర్ నుంచి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయాయని ఆయన వెల్లడించారు. ఎందుకిలా జరిగిందనే విషయాన్ని తాము విశ్లేషించాల్సి ఉందని తెలిపారు. డేటాను పరిశీలించిన అనంతరం దీనికి గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్త దేవీ ప్రసాద్ కార్నిక్ కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. క్రాష్ ల్యాండింగ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. క్రాష్ ల్యాండింగ్ కు అవకాశం లేదని వారు చెబుతున్నారు.