మా నాన్న పాక్ వీరసైనికుడే.. భారత్పై దాడితో నాకేం సంబంధం? ‘పద్మశ్రీ’ వివాదంపై సింగర్ సమీ
''తండ్రుల కర్మలకు కొడుకులు బాధ్యులవుతారా? కొడుకుల చేష్టలకు తండ్రులు బలికావడం కరెక్టవుతుందా? నిజమే.. మా నాన్న(అర్షద్ సమీ ఖాన్) పాకిస్తాన్ వీరసైనికుడే. విధినిర్వహణలో యుద్ధాలు చేసుండొచ్చు. దాంతో నాకు సంబంధంలేదు. ఇప్పుడు నేను అచ్చమైన భారతీయుణ్ని. 18 ఏళ్లు పోరాడిమరీ భారత పౌరసత్వం సంపాదించుకున్నాను. కళారంగంలో నా కృషికి గుర్తింపుగానే 'పద్మశ్రీ' అవార్డు దక్కింది. దీన్ని రాజకీయం చేయడం సరికాదు. కళలు, రాజకీయాల్ని వేర్వేరుగానే చూడాలి''అని స్పష్టం చేశారు ప్రముఖ సింగ్ అద్నాన్ సమీ.
అసలేం జరిగింది?
పుట్టుకతో పాకిస్తానీ అయిన అద్నాన్ సమీ ఖాన్కు 2016లో భారత పౌరసత్వం లభించింది. అంతకుముందే ఆయన పాకిస్తానీ పాస్ పోర్టును వదులుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లో మతపరమైన వివక్ష ఎదుర్కొంటున్న ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భంలో ఆ చట్టాన్ని సమీ బాహాటంగా సమర్థించడం, అంతలోనే మోడీ సర్కార్ ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం రాజకీయ రచ్చకు దారితీసింది.
కార్గిల్ వీరులపై కక్ష.. సమీకి అందలమా?
అస్సాంలో ఎన్ఆర్సీ అమలుతో అక్రమచొరబాటుదారులుగా గుర్తింపుపొందిన 19 లక్షల మందిలో చాలా మంది భారతీయులున్నారు. వారిలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీరజవాన్ మొహ్మద్ ససుల్లా ఒకరు. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఫ్యామిలీని కూడా అక్రమ చొరబాటుదారులుగానే ప్రభుత్వం గుర్తించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గీల్ మాట్లాడుతూ.. ‘‘కార్గిల్ వీరుణ్నిచొరబాటుదారుడిగా ముద్రించి... భారత్పై యుద్ధం చేసిన పాక్ ఆర్మీ అధికారి కొడుకు అద్నాన్ సమీకి పద్మశ్రీ ఎలా ఇస్తారు? ఇదెక్కడి న్యాయం?‘‘అని కేంద్రాన్ని నిలదీశారు. షెర్గీల్ కామెంట్లను సమీ తీవ్రంగా ఖండించారు.
18 ఏళ్ల పోరాటం..
‘‘తాతలు, తండ్రుల చరిత్రల ఆధారంగా వారి వారసులపై ముద్రలు వేయడం సరైందికాదు. నాకు బీజేపీతోపాటు కాంగ్రెస్ లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. షెర్గీల్ లాంటి చోటా నాయకులు తప్ప కాంగ్రెస్ పెద్దలెవరూ దీని గురించి మాట్లాడటం లేదు. అంటే ఇదెంత అర్థరహితమైన వాదనో అర్థం చేసుకోవచ్చు. భారత పౌరసత్వం కోసం తాను 18 ఏళ్లు పోరాడాను. ఎన్నో సార్లు తిరస్కరణకు గురైనా, మళ్లీ మళ్లీ ప్రయత్నించాను. కానీ ఏరోజూ మీడియా ముందుకొచ్చి నా బాధలు చెప్పుకోలేదు. ఒక భారతీయుడిగా నా దేశం నాకిచ్చిన పద్మశ్రీ అవార్డును గర్వకారణంగా భావిస్తున్నాను. నా జీవితానికి సంబంధించి అత్యంత సంతోషకర సమయంలో ఇలాంటి విమర్శలు రావడం బాధాకరం. అయితే ఇవేవీ ఇండియా పట్ల నా ప్రేమని, కాన్ఫిడెన్స్ ని తగ్గించలేవు‘‘అని సమీ ధీమా వ్యక్తం చేశారు.
మోదీకి జైకొట్టినందుకే..
కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారం దక్కడంపై అదోరకం వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో ఉండి కూడా మోదీకి జైకొడితే పౌరసత్వాలు, పద్మశ్రీలు ఈజీగా వచ్చేస్తాయని అర్థమవుతోందని, అలాంటప్పుడు సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాల అవసరం ఏముందని దిగ్విజయ్ ప్రశ్నించారు.
భారత్పై బాంబులేసిన సమీ తండ్రి..
అద్నాన్ సమీ తండ్రి అర్షద్ సమీ ఖాన్ 1965 భారత్- పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. పాక్ ఎయిర్ ఫోర్సులో కమాండర్ గా పనిచేసిన ఆయన.. నాటి యుద్ధంలో భారత సైన్యానికి చెందిన 15 ట్యాంకులు, 22 వాహనాలు, ఒక విమానాన్ని ధ్వంసం చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. 1972లో ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైరైన అర్షద్ సమీ.. అప్పటి జుల్ఫికర్ అలీ భుట్టో సర్కారులో విదేశాంగ శాఖలో ఉన్నతోద్యోగిగా సేవలందించారు. క్యాన్సర్ బారినపడి 2009లో చనిపోయారు. ఆయన చనిపోడానికి ఎనిమిదేళ్ల ముందే.. 2001లో సింగర్ సమీ ఇండియాలోకి అడుగుపెట్టారు.