శ్రీదేవి మృతిపై విచారణకు పిటిషన్: తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..
న్యూఢిల్లీ: శ్రీదేవి మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సునీల్ సింగ్ అనే ఫిలిం మేకర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ ను విచారణకు స్వీకరించబోమన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా.. శ్రీదేవి మరణంపై ఇదివరకే దుబాయ్, భారతీయ అధికారులు విచారించారని అన్నారు. కాబట్టి దీనిపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.
కాగా, శ్రీదేవి మరణించిన సమయంలో.. తాను కూడా దుబాయిలోనే ఉన్నట్టు పిటిషనర్ సునీల్ సింగ్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లినట్టు చెప్పారు. శ్రీదేవి మృతి చెందిన హోటల్ సిబ్బందితో తాను మాట్లాడానని, అలాగే శ్రీదేవిని తరలించిన ఆసుపత్రి సిబ్బందితోనూ మాట్లాడానని, ఈ వ్యవహారం తనకు వివాదాస్పదంగా అనిపించిందని చెప్పుకొచ్చారు.
కాగా, ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయి వెళ్లిన శ్రీదేవి(54).. ఫిబ్రవరి 24న హోటల్ గదిలోని బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే.