అమిత్ షా..పక్కా లోకల్: ఆర్మీ క్యాంటీన్లలో అన్నీ స్వదేశీ వస్తువులే: విదేశీ వస్తువుల బహిష్కరణ?
న్యూఢిల్లీ: ఊహించిందే జరుగుతోంది. అంచనాలు తప్ప లేదు. ఏ మాత్రం తలకిందులూ కాలేదు. అవన్నీ వాస్తవాలు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇక విదేశీ వస్తువుల బహిష్కరణ దిశగా అడుగులు వేస్తోంది. సంచలన నిర్ణయాలను తీసుకుంటోంది. వోకల్ ఫర్ లోకల్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నినదించిన నేపథ్యంలో.. దేశీయ తయారీపై దృష్టి సారించింది. వాటి అమ్మకాలను ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
మోడీ ప్యాకేజీకి ఓ లెక్కుంది: ఇక మేడిన్ చైనా వస్తువులకు బ్రేక్: డ్రాగన్ వెన్ను విరిచే స్కెచ్
జూన్ 1 నుంచి అమలు..
కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్)కు చెందిన క్యాంటీన్లలో ఇకపై అన్నీ స్వదేశీ వస్తువులను మాత్రమే అమ్మకానికి ఉంచబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానాన్ని జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకుని రాబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు. ఇకపై సీఏపీఎఫ్ క్యాంటీన్లలో విదేశీ విస్తువులను విక్రయించబోమని ప్రకటించారు. ఫలితంగా- 10 లక్షల సీఏపీఎఫ్ బలగాలకు చెందిన 50 లక్షల కుటుంబ సభ్యులు ఇకపై పూర్తిగా స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సీఏపీఎఫ్ పరిధిలో..
సీఏపీఎఫ్ పరిధిలొోనే అనేక సాయుధ బలగాలు ఉన్నాయి. సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సీమా సురక్షా బల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎన్ఎస్జీ), అస్సాం రైఫిల్స్ ఉన్నాయి. వాటన్నింట్లో సుమారు 10 లక్షల మంది పని చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఈ సంఖ్య 50 లక్షలకు చేరుకుంటుంది. వారి కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్ల ద్వారా సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నమోదవుతున్నాయి.
దేశీయ పరిశ్రమలకు ఊతం ఇచ్చిన మరుసటిరోజే..
అదే సమయంలో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని తెర మీదికి తీసుకుని రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసి ఉండొచ్చు. ఆత్మనిర్భర్ అభియాన్ పేరుతో ప్రకటించిన ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రధానంగా వ్యవసాయం, దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడానికేనని ప్రధానమంత్రి తన ప్రసంగంలో స్పష్టంగా తెలియజేశారు. వోకల్ ఫర్ లోకల్ నినాదానికి అనుగుణంగా దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తామనీ చెప్పారు. ఆయన ప్రసంగించిన మరుసటి రోజే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిబంధనను తెరమీదికి తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రెండు రకాలుగా మేలు..
ఈ ఆర్థిక ప్యాకేజీ వల్ల రెండురకాలుగా మేలు కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. లాక్డౌన్ వల్ల మూతపడిన దేశీయ తయారీ రంగానికి ఈ ప్యాకేజీ ఊపిరి ఊదే అవకాశాలు లేకపోలేదు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను లాక్డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఉపయోగపడుతుంది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల పొరుగు దేశాల నుంచి భారత్కు దిగుమతి అవుతోన్న వస్తువులను నియంత్రించడానికీ ఈ ప్యాకేజీ ఉపకరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.