ఎవరు?: పారిశ్రామిక వేత్తలపై శరద్ యాదవ్ ఫైర్
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సజావుగా నడిచేలా చేయాలంటూ పారిశ్రామిక వేత్తలు ట్విట్టర్లో చేసిన ట్వీట్స్పై జేడీయూ నేత శరద్యాదవ్ మండిపడ్డారు. రాజ్యసభలో ఆయన బుధవారం మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలు బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయని, వాటిని నిజం చేస్తూ పారిశ్రామిక వేత్తలు పార్లమెంట్ సమావేశాలు జరగనివ్వాలంటూ చేసిన ఆన్లైన్ విక్షప్తిపై ఆయన మండిపడ్డారు.
పార్లమెంటు ఎలా పనిచేయాలో చెప్పడానికి పారిశ్రామిక వేత్తలు ఎవరు? అంటూ ఆయన నిలదీశారు. 68 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో మొదటిసారిగా పార్లమెంట్ కార్యక్రమాలు సజావుగా జరగనివ్వాలంటూ పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని, ఈ పార్లమెంట్ను 125 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారన్న విషయం వారు తెలుసుకోవాలని శరద్ యాదవ్ అన్నారు.
మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినట్టు ఆ పెట్టుబడిదారులపై ఆరోపణలు ఉన్నాయని, అవి నిజమని ఈ రోజు నిరూపణ అయిందని శరద్ యాదవ్ అన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అరుణ్జైట్లీ, శరద్ యాదవ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పార్లమెంట్ సమావేశాలు జరగ్గకూడదని సాధారణ పౌరులు కోరుకుంటారా? అని ప్రశ్నించారు.
పార్లమెంట్ సమావేశాలు జరగ్గకుండా ప్రతిపక్షాలే ప్రయత్నిస్తున్నాయని, ఈ వ్యవహారంలో నేరస్తులు మీరేనని జైట్లీ విమర్శించారు. కాగా, ఈ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగకపోవడంతో భారత వాణిజ్య రంగానికి ఊతం ఇచ్చే వస్తు సేవల బిల్లు పెండింగ్ లో పడిపోయింది.
దీంతో 15 వేల మందికిపైగా పారిశ్రామిక వేత్తలు పార్లమెంటును సజావుగా సాగేలా చూడాలంటూ విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలకు సోషల్ మీడియా మాధ్యమంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన రాజ్యసభలో బుధవారం మండిపడ్డారు.