ఈసీ షాక్ : క్యాప్టెన్ విజయ్ కాంత్ పార్టీ ఔట్
న్యూఢిల్లీ: తమిళనాడులో ఒక వెలుగు వెలుగుతానని, తానే ముఖ్యమంత్రి అవుతానని పదేపదే చెప్పి రాజకీయ నాయకులకు చుక్కలు చూపించిన క్యాప్టెన్ విజయ్ కాంత్ కు దెబ్బ మీద దెబ్బ పడింది. ఇప్పటికే పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయ్ కాంత్ కు ముఖం చూపించడం లేదు.
ఇప్పుడు తాజాగా ఆయనకు ఎన్నికల సంఘం పెద్ద షాక్ ఇచ్చింది. తమిళనాడులో డీఎండీకే పార్టీ గుర్తు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విజయ్ కాంత్ పరిస్థితి ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అయ్యింది. విజయ్ కాంత్ మింగలేక, కక్కలేక నానా తంటాలు పడుతున్నారు.
2011 శాసన సభ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని పలువురు శాసన సభ్యులను గెలిపించుకున్న విజయ్ కాంత్ వారికి బాస్ అయ్యారు. అయితే 2016 శాసన సభ ఎన్నికల్లో చిన్నా చితకా పార్టీలతో జత కలిసి సీఎం రేసులోకి దిగిన విజయ్ కాంత్ డిపాజిట్లు కొల్పోయారు.
డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు వచ్చాయి. ఓ ప్రాంతీయ పార్టీకి ఎన్నికల గుర్తు ఉండాలంటే కనీసం ఆరు శాతం ఓట్లు రావాలి. అయితే విజయ్ కాంత్ ఆ ఓట్లు సంపాధించడంలో విఫలం అయ్యారు. అందుకు ఫలితంగా డీఎండీకే పార్టీ గుర్తు రద్దు అయ్యింది. ఇప్పుడు ఏమి చేద్దాం అని విజయ్ కాంత్ అనుచరులు అయోమయంలో పడ్డారు.
ఎన్నికల సంఘం వద్ద ఉన్న గుర్తింపు రద్దు కావడంతో విజయ్ కాంత్ తనకు అత్యంత సన్నిహితులైన వారితో చర్చలు మొదలు పెట్టారని తెలిసింది. 2016 శాసన సభ ఎన్నికల్లో ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయాం అని సమీక్షించుకుంటున్నామని, ఈ ఎన్నికల్లో మనీ పవర్ ప్రధానంగా పని చేసిందని మాజీ ఎంపీ ధనరాజ్ అంటున్నారు. అయితే మొత్తం మీద క్యాప్టెన్ కు కోలుకోలేని షాక్ లు ఎదురౌతున్నాయి.