దాడి చేయమనే పంపారు: నవేద్, జమ్మూకు తరలింపు
న్యూఢిల్లీ: భారతదేశంపై దాడి చేయడానికే తమను లష్కరే తోయిబా పంపించిందని ప్రాణాలతో పట్టుబడి పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ నవేద్ చెప్పాడు. అంతేగాక, ఈ దాడులు పూర్తయిన తర్వాత డబ్బు ఇస్తామని చెప్పిందని, లష్కరే వద్దే తాను శిక్షణ పొందానని మంగళవారం జరిగిన నిజ నిర్థారణ పరీక్షలో పాక్ ఉగ్రవాది నవేద్ వెల్లడించాడు.
తనకు జూదం అలవాటు ఉందని, తనను ఇంటి నుంచి తరిమేసినట్టుగా కూడా నవేద్ తెలిపినట్టు జాతీయ దర్యాప్తు ఏజెన్సీ అధికారులు తెలిపారు. నవేద్ అందించిన వివరాలను బట్టి అతడితో భారత్లోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదుల నమూనా స్కెచ్లను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు.
వీరిద్దరూ ఏ క్షణంలోనైనా దాడులు జరిపే అవకాశం ఉండటంతో భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. వీరిలో 18 సంవత్సరాల అబూ ఒకాషా పాకిస్థాన్లోని ఖైబర్ పక్తున్క్వా ప్రాంతానికి చెందిన వాడని, మొహమ్మద్ భాయ్ అనే 38ఏళ్ల మరో ఉగ్రవాది కూడా ఇదే ప్రాంతానికి చెందిన వాడని అధికారులు తెలిపారు.
వీరి కోసం ఇప్పటి వరకూ గాలింపు జరిపినా వారి ఆచూకీ తెలియలేదని వెల్లడించారు. నవేద్తో పాటు కాశ్మీర్ నుంచి ఈ ముగ్గురు ఉగ్రవాదులు భిన్న లక్ష్యాలతో భారత్లోకి ప్రవేశించారని తెలిపారు. వీరిలో నోమన్ అనే ఉగ్రవాది ఆగస్టు 5న జరిగిన పారామిలటరీ దాడిలో హతమయ్యాడు.
అప్పుడే నవేద్ ప్రాణాలతో భారత జవాన్లకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి విచారిస్తున్నప్పటికీ ఎప్పుడూ నిజం చెప్పక పోవడం, భిన్న కథనాలను వినిపించడంతో మంగళవారం లై డిటెక్టర్ పరీక్ష జరిపి అసలు వివరాలను అధికారులు రాబట్టారు. నవేద్ తమ దేశస్థుడు కాదని పాకిస్థాన్ ఇప్పటికే చెప్పడంతో అతడి డిఎన్ఎను కూడా అధికారులు సేకరించారు.
నవేద్ చెప్పిన వివరాల మేరకు అధికారులు అతడ్ని బుధవారం జమ్మూకు తరలించే ఏర్పాట్లు చేశారు. అతని వెంట వచ్చిన మరో ఇద్దరు ఉగ్రవాదులు ఏయే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందో, ఆ ప్రాంతాలను పరిశీలించే అవకాశం ఉంది.