మంటల్లో చిక్కుకున్న కారు.. వ్యక్తి సజీవ దహనం..
ఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగిన ఘటనలో ఓ వ్యక్తిచనిపోయాడు. అగ్ని కీలల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. కారు, వ్యక్తి శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతుడు ఎవరన్నది తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
గురువారం రాత్రి 10.30గంటల సమయంలో వాయువ్య ఢిల్లీలోని పీతంపురా ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. మధుబన్ చౌక్ ప్రాంతంలో మహీంద్రా ఎక్స్యూపీ 500 వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెకన్ల వ్యవధిలోనే వాహనమంతా వ్యాపించాయి. మంటలు ఎగిసిపడటంతో దాన్ని నడుపుతున్న వ్యక్తి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మంటల్ని గమనించిన కొందరు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అగ్ని కీలల్లో చిక్కుకుని కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
స్థానికులు ఇచ్చిన సమాచారం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. మంటల్ని ఆర్పేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటల్లో చిక్కుకున్న వ్యక్తి కాలి బూడిదయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు, అందులో ఉన్న వ్యక్తి పూర్తిగా కాలిపోవడంతో అతను ఎవరన్నది గుర్తించడం కష్టంగా మారింది. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు పంపిన పోలీసులు మృతుడు ఎవరన్నది తెలుసుకునే పనిలో పడ్డారు.