నిత్య పెళ్ళికొడుకు: నాలుగో పెళ్ళికి భర్త, అడ్డుకొన్న మూడో భార్య
చెన్నై: నాలుగో పెళ్ళి చేసుకొనేందుకు పెళ్ళి పీటలపై సిద్దమైన పెళ్ళికొడుకును మూడవ భార్య పోలీసులకు పట్టించింది.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. ఒకరికి తెలియకుండా నిందితుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నాడు.నిందితుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై పరిధిలోని తనికాచలం నగర్ కు చెందిన నందకుమార్ (34) కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతని వివాహం కోసపేటకు చెందిన విజయలక్ష్మి (30) అనే యువతితో నిశ్చయమైంది.
ఆదివారం నాడు పెరంబూరు నుంచి సిరువళ్లూరు వెళ్లే రహదారిలో ఉన్న ఓ కల్యాణ మండపంలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్న వేళ, కొళత్తూరుకు చెందిన ఉష మండపానికి వచ్చి పెళ్లిని అడ్డుకుంది.
తన భర్త నిర్వాకంపై సెబియం పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని వెంటబెట్టుకుని వచ్చింది ఉష. పెళ్ళి మండపంలోనే నిందితుడి చరిత్రను బయటపెట్టింది. దీంతో వివాహం రద్దైంది.
ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకుని నందకుమార్ మోసం చేశారని ఉష వివరించారు. నాలుగో పెళ్ళి చేసుకొంటూ తనకు అన్యాయం చేసేందుకు సిద్ధపడ్డాడని ఉష పెళ్ళి మండపంలోనే నందకుమార్ చరిత్రను పూసగుచ్చినట్టు వివరించింది.
రైల్వే ఉద్యోగిని అని చెప్పి నందకుమార్ పలువురిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు తేల్చారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.