చెరువులో పడిపోయిన మారుతి షిఫ్ట్ కారు, మహిళలతో సహ ఐదుగురి జలసమాధి!
బెంగళూరు: వేగంగా వెలుతున్న కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు జలసమాధి అయిన ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా హళేనరసీపుర తాలుకా హనుమనహళ్ళి ప్రాంతంలో జరిగింది. బుధవారం చెరువులోని నీటిలో మృతదేహాలు తేలుతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతులు ఉమేష్ (22), అనీల్ (24) అని గుర్తించామని పోలీసులు చెప్పారు. మరో ముగ్గురి వివరాలు సేకరిస్తున్నామని, మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు అన్నారు. మూడు రోజుల క్రితం ప్రమాదం జరిగి ఉంటుందని, చెరువులో 20 అడుగుల లోతు నీటిలో మారుతి షిఫ్ట్ కారు గుర్తించామని పోలీసులు తెలిపారు.
అద్దె కారులో మూడు రోజుల క్రితం ఐదు మంది హంగరహళ్ళి ప్రాంతం నుంచి హనుమహళ్ళి వైపు బయలుదేరారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. 2013లో విష్ణు సముద్రం చెరువులో కేఎస్ఆర్ టీసీ బస్సు పడిపోవడంతో 15 మంది ప్రాణాలుపోయాయి.
2017 జులై నెలలో హాసన్ జిల్లా తెట్టవాలు చెరువులో బస్సు మునిగిపోవడంతో ఆరు మంది ప్రయాణికులు మరణించారు. హాసన్ జిల్లాలోని అనేక చెరువుల్లో వాహనాలు మునిగిపోవడంతో పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇదే హాసన్ జిల్లాలో గతంలో అనేక మంది ప్రమాదాలలో జలసమాధి అయ్యారు.