ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత కారుకు నిప్పు
సూరత్: ఇన్సూరెన్స్ డబ్బు కొట్టేయాలని మాస్టర్ ప్లాన్ వేసిన ఓ నాయకుడు చివరికి కటకటాలపాలైనాడు. కారు పోయింది, ఉన్న పరువు పోయింది. చివరికి పోలీసులకు చిక్కడంతో కేసు నమోదు చేశారు.
సర్తనా ప్రాంతంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. కారు వెనుక భాగంలో పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్ధిక్ పటేల్ బొమ్మ ఉంది.
దానితో పాటు పటేల్ రిజర్వేషన్ పోరాటంలో మరణించిన వారి ఫోటోలు అతికించారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. కారు యజమాని దినేష్ చొరాదియాను పట్టుకుని విచారించారు. తాను ఇద్దరు స్నేహితులతో కలిసి కారుకు నిప్పంటించానని దినేష్ అంగీకరించాడు.
ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి కారును తగలబెట్టామని చెప్పాడని పోలీసులు అన్నారు. పోలీసులకు సహకరించిన నితిన్ దంగర్, భవేశ్ దంగర్ లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.