ఆధార్ కార్డు ప్రాజెక్టు విఫలమవ్వాలనుకుంటున్నారు: యూఐడీఏఐ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు ప్రాజెక్టు విఫలమవ్వాలనుకుంటున్నారని కొందరు భావిస్తున్నారని యూఐడీఏఐ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఎందుకంటే ఒకసారి ఈ ప్రాజెక్టు విజయవంతమైన ప్రతి ఒక్కరి గుర్తింపు కోసం యూఐడీ ఒక విశిష్టమైనదిగా మారితే వారి వ్యాపారాలు ప్రమాదంలో పడతాయని యూఐడీఏఐ తరఫు కౌన్సెల్ వాదించింది.
ఓసారి ఆధార్ విజయవంతమైతే స్మార్ట్ కార్డులకు వ్యాపారం ఉండదని, స్మార్ట్ కార్డు లాబీకి సైతం ఆధార్ విజయవంతం కావడం ఇష్టం లేదని, అందుకే ఆధార్ పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఆధార్ డేటా భద్రత గురించి రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ.. కేంబ్రిడ్జ్ అనాలిటికా వ్యవహారాన్ని ఇందులోకి తీసుకు రావొద్దని చెప్పారు. ఆ విషయంలో వాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతుండగా, యూఐడీఏఐ విషయంలో అలా జరగడం లేదన్నారు. మరోవైపు, కులం, మతం తదితర అంశాలు రికార్డ్ చేయలేదని, అందువలన వివక్షకు తావుండదని తెలిపారు.