18 చోరీలు చేశాడు: నటి కరిష్మా కపూర్ ఇంటినీ వదల్లేదు
ప్రముఖ బాలీవుడ్ సినీనటి కరిష్మాకపూర్తోపాటు 18 మంది సంపన్నుల ఇళ్లలో దొంగతనాలు చేసిన వ్యక్తి ఎట్టకేలకు ముంబై పోలీసుల చేతికి చిక్కాడు.
ముంబై: ప్రముఖ బాలీవుడ్ సినీనటి కరిష్మాకపూర్తోపాటు 18 మంది సంపన్నుల ఇళ్లలో దొంగతనాలు చేసిన వ్యక్తి ఎట్టకేలకు ముంబై పోలీసుల చేతికి చిక్కాడు. ముంబై నగరానికి చెందిన ఇంతియాజ్ అన్సారీ (35) అనే వ్యక్తి కార్పెంటరుగా పనిచేసేవాడు.
తాను కార్పెంటర్ గా పనిచేస్తానని చెప్పి ల్యాండ్ లైను ఫోనులో సంప్రదించి వారి చిరునామాను కనుక్కొని వెళ్లి చోరీలు చేస్తున్నట్లు నిందితుడు ఇంతియాజ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. ముంబై నగరంలో సంపన్నులు నివాసం ఉంటున్న ఖర్, జుహు, విలేపార్లే, బాండ్రా ప్రాంతాల్లోని 18 ఇళ్లలో ఇతను చోరీలు చేశాడని తేలింది.
కార్పెంటరుగా పనిచేసేందుకు సినీనటి కరిష్మాకపూర్ ఇంటికెళ్లిన ఇంతియాజ్ అక్కడ పనిమనిషి పర్సును దొంగిలించాడని ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ పరంజిత్ దహియా చెప్పారు. దొంగతనం చేసినపుడు ఆ ఇల్లు సినీనటి కరిష్మాకపూర్దని తనకు తెలియదని దొంగ ఇంతియాజ్ చెప్పాడు.
కరిష్మా కపూర్ నివాసంలో గత నెలలో అతను దొంగతనానికి పాల్పడ్డాడు. పర్సుతో పాటు అతను డెబిట్ కార్డును కూడా దొంగిలించాదడు. కుర్లాలోని కామని ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ అన్సారీ గతంలో నాలుగు చోరీ కేసుల్లో అరెస్టయ్యాడు.