ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు.. పార్టీ నుంచి సస్పెండ్
బెంగళూరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హత్యాయత్నం కింద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తనపై గణేశ్ దాడి చేశారనే వాంగ్మూలం మేరకు పోలీసులు స్పందించారు. అపోలో ఆసుపత్రిలో ఆనంద్ సింగ్ కు చికిత్స కొనసాగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం గణేశ్ చర్యను ఖండించింది. సహచర ఎమ్మెల్యేపై దాడి చేసినందుకు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పరమేశ్వర నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిన పార్టీ పెద్దలు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.
కాంగ్రెస్ - జేడీఎస్ అలయెన్స్ గవర్నమెంటును దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం జరిగింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని శుక్రవారం నాడు ఓ రిసార్టుకు తరలించారు. అయితే శనివారం రాత్రి గణేశ్, ఆనంద్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆనంద్ సింగ్ పై గణేశ్ దాడి చేయడం చర్చానీయాంశమైంది.