అన్నాడీఎంకే రెబల్ ఎమ్మేల్యే మీద కేసు, పరార్, రూ. 1,500 కోట్ల స్కాం, సీఎంకు వాటా!
చెన్నై: టీటీవీ దినకరన్ కు మద్దతు ఇచ్చి అనర్హతకు గురైన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ మీద చెన్నై పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో ఇద్దరూ పరార్ అయ్యారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు రహస్యప్రాంతంలో తలదాచుకున్నారు. తమిళనాడులో జాతీయ రహదారులు వేస్తున్నారని, కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడి రూ. 1,500 కోట్లు స్వాహా చేశారని, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి అందులో వాటా ఇస్తున్నారని టీటీవీ దినకరన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
అసెంబ్లీలోకి చొరబాటు!
గురువారం అనర్హతకు గురైన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ సెక్రటేరియట్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ తో పాటు వారి అనుచరులను అడ్డుకున్నారు.
రెబల్ ఎమ్మెల్యేల రచ్చ
సెక్రటేరియట్ లో తాను సీఎం ఎడప్పాడి పళనిస్వామి మీద ఫిర్యాదు చెయ్యాలని, అధికారులను కలవాలని, జాతీయ రహదారుల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని, లొనికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులతో వాగివ్వాదానికి దిగిన వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్, వారి అనుచరులు రచ్చరచ్చ చేశారు.
రూ. 1,500 కోట్ల స్కాం
జాతీయ రహదారులు టెండర్లలో రూ. 1,500 కోట్లకు పైగా భారీ కుంభకోణం జరిగిందని, ఈ స్కాం వలన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ దెబ్బ పడిందని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగ్
పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల విధులు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారని శుక్రవారం చెన్నై పోలీసులు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ మీద చెన్నైలోని ఫోర్డ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. విషయం తెసుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు రహస్యప్రాంతంలో తలదాచుకున్నారు.
వదలద్దు, ప్రత్యేక పోలీసు టీంలు
అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ ఎక్కడ ఉన్నా వదిలి పెట్టరాదని, అరెస్టు చెయ్యాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు అధికారులు 7 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.