పంజాబ్ సీఎం చంపితే రివార్డ్.. మిలియన్ డాలర్లు అంటూ పోస్టర్.. కేసు నమోదు
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ను చంపితే మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని ఓ పోస్టర్ వెలిసింది. ఏకంగా సీఎంను చంపితే రివార్డు పోస్టర్ కనిపించి కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలో గల ఒక గైడ్ మ్యాప్పై పోస్టర్ అంటించి ఉంది అని పోలీసులు తెలిపారు. పోస్టర్పై ఈ-మెయిల్ అడ్రస్ కనుగొన్నట్టు తెలుస్తోంది.
సీఎం అమరిందర్ సింగ్ను బెదిరిస్తూ పోస్టర్ వేసిన అగంతుకునిపై ఐపీసీ సెక్షన్ 504,506,120బి కింద, పంజాబ్ ప్రివెన్షన్ ఆఫ్ డీఫేస్మెంట్ ప్రాపర్టీ ఆర్డినెన్స్ యాక్ట్ 1997 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు మొహాలీ సిటీ ఎస్పీ తెలిపారు. డిసెంబర్ 31న ఈ పోస్టర్ వెలియగా.. దీనిపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.
బెదిరింపు పోస్టర్ వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ఘటనా స్థలి వద్ద గల సీసీటీవీ ఫుటేజ్ను స్కానింగ్ చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కానీ ఈ పోస్టర్ మాత్రం తీవ్ర కలకలం రేపింది.