PMC బ్యాంకులో భారీ అవకతవకలు: సీఈఓ, ఇతర ఉన్నతాధికారులపై కేసు నమోదు
ముంబై: గత కొద్ది రోజులుగా వార్తల్లో ఉన్న పంజాబ్ మరియు మహారాష్ట్ర బ్యాంక్ (పీఎంసీ బ్యాంక్) తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ముంబై పోలీస్ ఆర్థిక నేరాల శాఖ పీఎంసీ బ్యాంకులో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసింది. ఆర్బీఐ అడ్మినిస్ట్రేటర్ సూచనల మేరకు హౌజింగ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ పై కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు.
ప్రపంచం వినింది..కానీ జైశంకర్ వినలేదు: ట్రంప్ గురించి మోడీ ఆ స్లోగన్ ఇవ్వలేదా ?
నిబంధనలను ఉల్లంఘించిన బ్యాంకు అధికారులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటర్ జస్బీర్ సింగ్ మత్త పీఎంసీ బ్యాంకు ఉన్నతాధికారులపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. 2008 ఆగష్టు నుంచి 2019 ఆగష్టు వరకు బ్యాంకు నుంచి ఓ కంపెనీకి ఇచ్చిన రుణాలు ఇప్పటి వరకు కట్టలేదని ఇప్పుడు అవి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్కిందకు మారిపోయాయని జస్బీర్ సింగ్ తెలిపారు.బ్యాంకింగ్ నిబంధనల మేరకు ఈ విషయాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకురావాలని తెలిసనప్పటికీ బ్యాంకు అధికారులు దీన్ని కావాలనే విస్మరించినట్లు తెలుస్తోందని జస్బీర్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన అధికారులు
పీఎంసీ బ్యాంకు అధికారులు తప్పుడు లోన్ అకౌంట్లు మరియు తక్కువ మొత్తంతో బూటకపు రికార్డులు సృష్టించారని ఆ రికార్డులనే ఆర్బీఐకి సమర్పించినట్లు జస్బీర్ వెల్లడించారు. వీరు పాల్పడిన ఈ పనికి దాదాపు రూ. 4,355.46 కోట్లు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇలా చేయడం వల్ల హెచ్డీఐఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇందుకు కారణం హెచ్డీఐఎల్ డైరెక్టర్ పీఎంసీ బ్యాంకు ఉన్నతాధికారులు కుమ్మక్కవడంతోనే జరిగిందని జస్బీర్ చెప్పారు.
రుణంను సొంత పనులకు వినియోగం
పీఎంసీ బ్యాంకు నుంచి రుణంగా తీసుకున్న వారు తమ సొంత పనులకు వినియోగించుకున్నారని జస్బీర్ ఆరోపించారు.దీంతో తీసుకున్న రుణం తిరిగి సమయానికి కట్టకపోవడం వల్ల బ్యాంకు నష్టాల ఊబిలోకి జారుకుందని చెప్పారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఆర్బీఐ అడ్మినిస్ట్రేటర్ వెల్లడించారు. పీఎంసీ బ్యాంకు సీఈఓ జాయ్ థామస్, ఛైర్మెన్ వారియం సింగ్, ఇతర బ్యాంకు ఉన్నతాధికారులతో పాటు హెచ్డీఐఎల్ గ్రూప్ ఛైర్మెన్ పేరు కూడా ఫిర్యాదులో చేర్చినట్లు చెప్పారు.
ఒకప్పుడు హెచ్డీఐఎల్ సంస్థలో పనిచేసిన ప్రస్తుత ఛైర్మెన్
సెప్టెంబర్ 23న ఆర్బీఐ అధికారులు పీఎంసీ బ్యాంకులో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పారు. పలు సంస్థలకు గత ఆరునెలల్లో రుణాలు ఇవ్వడంలోనే ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయని తాము గుర్తించినట్లు వెల్లడించారు. 2006 నుంచి 2015వరకు హెచ్డీఐఎల్ సంస్థలో టాప్ పోస్టులో ప్రస్తుత పీఎంసీ బ్యాంకు ఛైర్మెన్ వారియం సింగ్ పనిచేశారని ఆ తర్వాత పీఎంసీ బ్యాంకు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టినట్లు ఆర్బీఐ అధికారులు వెల్లడించారు.
కొద్ది రోజుల క్రితం విత్డ్రాల్స్ పై పరిమితి విధింపు
అదే సమయంలో పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు రోజుకు రూ.1000 మాత్రమే నగదు విత్డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటటంతో ఆర్బీఐ ఆ ఆంక్షలను ఎత్తివేస్తూ విత్డ్రా పరిమితిని రూ. 10వేలకు పెంచింది. ఇక నిందితులపై ఐపీసీ సెక్షన్ 409, 420, 465, 471,120(బీ) కింద కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంను విచారణ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ముంబై పోలీసు శాఖ ఏర్పాటు చేయనుంది.