ATM టైమింగ్స్: రాత్రి 9 గంటలు దాటితే ATMలలో క్యాష్..?
Recommended Video
ఏటీఎంలలో రాత్రి 9 గంటల్లోపు క్యాష్ నింపాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. నగరాల్లో రాత్రి 9 గంటల లోపు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల్లోగా క్యాష్ నింపాలని ప్రైవేట్ ఏజెన్సీలకు కేంద్రం సూచించింది. ఉదయం బ్యాంకు తెరుచుకున్న వెంటనే ప్రైవేట్ ఏజెన్సీలు డబ్బును ఏటీఎంలలో నింపేందుకు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రహోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని సూచనలను కేంద్రహోంశాఖ విడుదల చేసింది. ఇది ఫిబ్రవరి 8, 2019 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. క్యాష్ ఏటీఎంలలో నింపేందుకు వెళుతున్న వ్యాన్లపై దాడులు చేసి కొందరు దుండగులు క్యాష్ కాజేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిబంధనలను తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా 8వేల ప్రైవేట్ వాహనాలు ఏటీఎంలలో డబ్బును నింపేందుకు పనిచేస్తున్నాయని... వాటిని ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ వ్యాన్ల ద్వారా రోజుకు రూ. 15వేలకోట్లను ఇవి రవాణా చేస్తున్నాయని తెలిపారు. అలాంటి సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కేంద్రం సూచించింది. అంతేకాదు ఒకవేళ సమయం మించిపోతే వ్యానులోనే రాత్రంతా ఆ డబ్బును ఉంచడంపై అభ్యతరం తెలిపింది కేంద్రం.
పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత, గ్రామీణా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత నగదు రవాణా చేయకూడదని సూచించింది కేంద్రం. అంతేకాదు ప్రైవేట్ ఏజెన్సీలు మంచి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని కోరింది. డబ్బులు ఏటీఎంలకు వ్యాన్ ద్వారా తరలించే సమయంలో ఆ వ్యానులో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉండాలని వారిలో ఒకరు డ్రైవర్ పక్కన కూర్చోవాలని చెప్పింది. మరో సెక్యూరిటీ గార్డు వ్యాను వెనక భాగంలో క్యాష్ ఉన్న చోట కూర్చోవాలని సూచించింది. వీరితో పాటు ఇద్దరు ఏటీఎం అధికారులు ఉండాలని చెప్పింది. సెక్యూరిటీ గార్డులు ఎక్స్ సర్వీస్మెన్లు అయితే మంచిదని కేంద్రం అభిప్రాయపడింది. ఇక భోజన సమయంలో, టీతాగేందుకు వెళ్లినా... తప్పకుండా వ్యాన్ దగ్గర ఒక్క సెక్యూరిటీ గార్డు ఉండాలని స్పష్టం చేసింది.
ఏటీఎంలలో క్యాష్నింపేందుకు వెళుతున్న వ్యానులో రూ.5 కోట్లకు మించి ఉండరాదనే నిబంధన కేంద్రం పెట్టింది. వ్యానులో జీపీఎస్ వ్యవస్థ ఉండాలని.. దీనితో పాటు చిన్న సీసీటీవీలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని తెలిపింది. ఈ సీసీ టీవీల రికార్డింగులు కనీసం ఐదురోజుల క్రితం ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. క్యాష్ లెక్కపెట్టాలన్నా, క్యాష్ డిపాజిట్ చేయాలన్నా ఇవ్వన్నీ చాలా భద్రత నడుమ జరగాలని కేంద్రం తెలిపింది.