ఆర్థిక ఇబ్బందుల్లో కాంగ్రెస్! కన్నెత్తి చూడని బడాబాబులు, సిబ్బంది జీతాలకూ కటకట!
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద వయసున్న పార్టీ అది. అలా చూసుకుంటే స్వాతంత్ర్యం రాకమునుపే ఆ పార్టీ ఏర్పాటైంది. నాడు మహామహులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రిటీష్ వారిపై ఏళ్ల తరబడి పోరాటం సాగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఎన్నో ఏళ్లపాటు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో చక్రం తిప్పింది.. కాంగ్రెస్.
అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అధికారం సంగతి అటుంచితే.. ఆర్థిక ఇబ్బందులు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎంతగా అంటే.. నిధులు లేక ఎన్నికల్లో తమ అభ్యర్థులను కూడా నిలబెట్టలేనంతగా. అవును, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిధుల కోసం కటకటలాడుతోంది!
ఆర్థిక ఇబ్బందుల్లో కాంగ్రెస్ పార్టీ...
ఒకప్పుడు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ దెబ్బకు చతికిలపడింది. ఇటు కేంద్రంలో, క్రమంగా అటు రాష్ట్రాల్లో ఆ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. మోడీ తీసుకొచ్చిన ‘నోట్లరద్దు' ఆ పార్టీ నోట్లో మట్టికొట్టిందనే వ్యాఖ్యనాలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకోలేక...
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తన సిబ్బందికి జీతాలు కూడా ఇచ్చుకోలేని స్థితికి చేరినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ, సీపీఐ ఎంపీ డి.రాజాతో చెప్పుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏఐసీసీ కార్యాలయంలో, సోనియా, రాహుల్ కార్యాలయాల్లో పనిచేస్తోన్న దాదాపు 70 మంది సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు.
తిరిగి చూడని వ్యాపార, పారిశ్రామికవేత్తలు...
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ హవాయే వేరుగా ఉండేది. దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు ఆ పార్టీ అధిష్ఠానం కరుణాకటాక్షాల కోసం తపించిపోయేవారు. కానీ 2014 లోక్సభ ఎన్నికల తరువాత పరిస్థితి మారింది. ఏటా పార్టీకి విరాళాలు ఇచ్చే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల్లో ఒక్కరు కూడా ఏఐసీసీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడడం లేదట. దీంతో ఆ పార్టీకి ఇప్పుడు నిధులు కరువయ్యాయి. కనీసం పార్టీ కార్యకలాపాలకు, సిబ్బంది జీతభత్యాలకు కూడా డబ్బులు సరిపోవడం లేదు.
నిధులు లేక అభ్యర్థులను తగ్గించుకుని...
నిధుల కొరత కారణంగా కాంగ్రెస్ పార్టీ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అభ్యర్థలును తగ్గించుకోవలసి వచ్చిందట. తొలుత 23 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ ఆ తరువాత వారిని 18 మందికి కుదించుకుంది. నాగాలాండ్లో కాంగ్రెస్ దాదాపు 15 ఏళ్లుగా అధికారంలో లేదు. అక్కడ ఆ పార్టీ చివరి ముఖ్యమంత్రి ఎస్సీ జమీర్. 1993-2003 మధ్య ఈయన అధికారంలో ఉన్నారు. ఆ తరువాత మూడు పర్యాయాలూ పార్టీది ప్రతిపక్ష పాత్రే. ఈనెల 27న అక్కడ పోలింగ్ జరగనుంది. అయితే ‘నిధులు సమకూర్చలేమంటూ పార్టీ అధిష్ఠానం నుంచి మాకు సమాచారం అందింది. అందుకే అభ్యర్తుల సంఖ్యను కూడా కుదించుకోవలసి వచ్చింది..' అని పేరు వెల్లడించాడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు.
ప్రస్తుతం వారిద్దరే...
వివిధ ఖర్చుల కోసం ఎదురవుతున్న ఇబ్బందులను ఏఐసీసీ కార్యాలయ అంతర్గత సిబ్బంది ఆ పార్టీ సీనియర్ నేతల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఒకప్పుడు ఆ పార్టీకి నిధులు ఒక ప్రవాహంలా పారేవి. అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో విరాళాలు అందుతుండేవి. ప్రస్తుతానికొస్తే... పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కర్నాటక సీఎం సిద్ధరామయ్య మాత్రమే తమ ‘నెలవారీ విరాళం' పార్టీకి పంపుతున్నారనీ.. అవి కూడా ఏ మూలకూ సరిపోవడం లేదని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏమిటో...
ఈ ఆర్థిక ఇబ్బందుల గురించి ఇటీవల రాజ్యసభలో ఆ పార్టీ నేత అయిన గులాం నబీ ఆజాద్ కూడా లేవెనెత్తారు. కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని, పార్టీకి విరాళాలిచ్చేందుకు ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలను అడ్డుకుంటున్నారంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి పరిస్థితి ఇప్పుడే ఇలావుంటే.. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు పార్టీకి నిధులెలా సమకూర్చాలనే దిగులు ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని వెంటాడుతోందని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.