బిగ్ షాక్ : కరెన్సీ కష్టాలు మరో నాలుగైదు నెలలు తప్పవు!
దేశంలో కరెన్సీ నోట్ల కొరత మరో నాలుగైదు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) వెల్లడించింది.
న్యూఢిల్లీ : త్వరలోనే నోట్ల కష్టాలు తీరుతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఈ కష్టాలు ఇప్పట్లో తీరేవి కావని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశంలో ఉన్న నాలుగు కరెన్సీ ముద్రణా కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించి నోట్ల ముద్రణ చేపట్టినా.. ఇప్పట్లో ఈ కొరతకు ఫుల్ స్టాప్ పడడం కష్టమని తేల్చింది.
నోట్ల రద్దుతో ఇప్పటికే సామాన్యుల్లో తీవ్ర అసహనం నెలకొనగా.. అది మరింతగా పెరిగే అవకాశముందని బీఈఎఫ్ఐ పేర్కొంది. వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించింది. దేశంలో కరెన్సీ నోట్ల కొరత మరో నాలుగైదు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడినా.. నోట్లు దొరకలేదన్న అసహనంతో కొంతమంది ఖాతాదారులు బ్యాంకు అద్దాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
దీనివల్ల పలు బ్యాంకుల కార్యాకలాపాలు సైతం నిలిచిపోయాయని వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి మన దేశంలో 15,707 మిలియన్ల రూ. 500 నోట్లు... 6,326 మిలియన్ల రూ. 1000 నోట్లు చెలామణిలో ఉన్నాయని తెలిపింది.