న్యాయ వ్యవస్థలోకి పాకిన కులగజ్జి..! ఆవేదన వ్యక్తం చేస్తున్న పాట్నా న్యాయమూర్తి ..!!
పట్నా/హైదరాబాద్ : సమాజంలో కుల గజ్జి మహమ్మారిలా వ్యాపిస్తోందని, అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న కులం అనే అంటు వ్యాధి చివరకు న్యాయ వ్యవస్థను కూడా విడిచిపెట్టలేదని ఓ న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల రహిత సమాజం కోసం మార్గదర్శకాలు అందించి, ఆదర్శంగా నిలవాల్సిన న్యాయవ్యవస్థలో కూడా కులజాడ్యం కరతాళ నృత్యం చేయడం దేనికి సంకేతమని ఓ న్యాయమూర్తి సూటిగా ప్రశ్నిస్తున్నారు.
న్యాయ వ్యవస్థలో వేళ్ళూనుకున్న అవినీతి, కులతత్వంపై సీనియర్ న్యాయమూర్తి చేసిన కామెంట్లు సంచలననంగా మారాయి. తమ కులం వారికి పోస్టింగ్ లు ఇప్పించుకునేందుకు ప్రధాన న్యాయమూర్తిని కాకాపడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పట్నా హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయమూర్తి రాకేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.న్యాయవ్యవస్థ మొత్తం అవినీతి, కులతత్వంలో కూరుకుపోయిందని, కులతత్వం, అవినీతి రాజ్యమేలుతున్నాయని ఆయన అన్నారు.
కొందరు సీనియర్ న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తిని కాకాపడుతున్నారు. వారందరూ తమ కులం, వర్గం వారికి పోస్టింగ్లు ఇప్పించుకునేందుకే సీజేను మంచి చేసుకుంటున్నట్టు తేలిందన్నారు. నలుగురు న్యాయాధికారుల మీద 11 నుంచి 21 దాకా అభియోగ పత్రాలున్నాయి. అవి అత్యంత తీవ్రమైనవి అయినప్పటికీ వారందిరినీ పదవుల నుంచి తొలగించడం లేదు. పదవుల నుంచి తప్పించకుండా కేవలం మందలింపుతో వదిలేశారు అంటూ రాకేష్ కుమార్ ఒక కేసుకు సంబంధించిన విచారణలో వ్యాఖ్యానించారు.
అయితే రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించాయి. రాకేష్ చేసిన ఆరోపణలపై పట్నా ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన విచారిస్తున్న కేసులన్నింటి ఆయనను తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై విచారణకు 11 మంది న్యాయమూర్తులతో ఒక బెంచ్ను ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారు.