కుల రాజకీయాలు: లోహియా విగ్రహానికి మాంఝీ దండే వేశారని, విగ్రహాన్ని శుద్ధి చేశారు
పాట్నా: బీహార్లో కుల రాజకీయాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని అనడానికి ఇదొకటి చక్కటి ఉదాహరణ. తాజాగా సుపౌల్లోని స్వాతంత్ర్య సమరయోధుడు రామ్ మనోహర్ లోహియా విగ్రహానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహా దళిత్ కమ్యూనిటీకి చెందిన నేత అయిన జతిన్ రామ్ మాంఝీ పూల దండలు వేశారు.
ఈ విషయం తెలుసుకున్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ కార్యకర్తలు మాంఝీ వేసిన పూల దండలను తీసిపారేశారు. అంతే కాదు ఆ తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఈ ఘటనపై జనతాదళ్ యునైటెడ్ చీఫ్ శరద్ యాదవ్ స్పందించారు.
"ఈ చర్యలను మేం ఖండిస్తున్నాం. రామ్ మనోహర్ లోహియా మాస్ లీడర్. ఆయన విగ్రహానికి పూలమాల వేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది" అని జేడీయూ అధ్యక్షడు శరద్ యాదవ్ అన్నారు. మరో వైపు ఈ ఘటనపై మాంఝీ స్పందిస్తూ ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
బీహార్కు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి నరసింహా రావు ఈ ఘటనపై మాట్లాడుతూ "బీహార్లో అభివృద్ది కేవలం దళితులకు వ్యతిరేకంగా జరుగుతుంది" అని అన్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న జతిన్ రామ్ మాంఝీని బలవంతంగా ఆ పదవి నుంచి తప్పించి, నితీశ్ కుమార్ సీఎం పదవిని అధిష్టించిన సంగతి తెలిసిందే.