కుల ఘర్షణ: ముగ్గురు దళితులను ట్రాక్టర్తో తొక్కించారు, మృతి
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో దారుణం జరిగింది. భూ వివాదాలు ముగ్గురు దళితుల హత్యకు దారి తీశాయి. అగ్ర కులమైన జాట్స్, దళితులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ వివాదం ముగ్గురు దళితులను బలిగొంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగౌర్ జిల్లాలోని దంగ్వాన్స్ గ్రామంలోని 20 హెక్టార్ల భూమి విషయంలో జాట్స్, దళితులకు మధ్య 1964 నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ భూ వివాదం కోర్టు దాకా కూడా చేరింది. అయితే భూ వివాదంపై గురువారం పంచాయతీ పెట్టారు. ఆ సమయంలోనే జాట్స్ వర్గానికి చెందిన వారు దళితులపై దాడి చేశారు.
దళితులపైకి ట్రాక్టర్స్ను తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ముగ్గురు దళితులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా దళితులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. వందలాది మంది దళితులపై విచక్షణారహితంగా దాడులు చేశారు.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వారిపై దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు మీడియాతో మాట్లాడుతూ.. తమ మర్మాంగాలపై ఇనుపరాడ్లతో దాడి చేసేందుకు యత్నించారని తెలిపారు. తమ వెంట్రుకలను పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లారని చెప్పారు. తమ కాళ్లపై రాడ్లతో కొట్టారు అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల నుంచి జాట్స్ వర్గం వారు తమపై దాడులు చేస్తూనే ఉన్నారని తెలిపారు.
పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. జాట్స్ వర్గంపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దళితులకు సంబంధించిన వాహనాలకు జాట్స్ వర్గం వారు నిప్పు పెట్టారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.