రక్తమోడుతోన్న సరిహద్దులు: చైనా సైనికులు కూడా మృతి: యుద్ధ ప్రాతిపదికన కదిలిన కేంద్రం
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: చైనా మరోసారి భారత్ను దొంగదెబ్బ కొట్టింది. ఒకవంక చర్చలు కొనసాగిస్తూనే మరోవంక దాడులకు పాల్పడుతోంది. తాజాగా మంగళవారం లఢక్ సమీపంలోని గాల్వన వ్యాలీ సమీపంలో చోటు చేసుకున్న ఘర్షణల్లో భారత్కు చెందిన ముగ్గురు జవాన్లు అమరులు అయ్యారు. మరణించిన వారిలో ఓ కమాండింగ్ అధికారి ఉన్నారు. ఈ ఘటనతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రక్తమోడాయి. రెండువైపులా ప్రాణనష్టం సంభవించింది.
చైనా సైనికులు కూడా మృతి
అనూహ్యంగా.. ఎలాంటి ముందుస్తు హెచ్చరికలు లేకుండా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘర్షణల ఉదంతంలో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. భారత్ తరఫున కల్నల్ స్థాయి ర్యాంకు గల కమాండింగ్ అధికారి, ఇద్దరు జవాన్లు అమరులు అయ్యారని పేర్కొన్న ఆర్మీ అధికారులు.. చైనా వైపు కూడా ప్రాణనష్టం సంభవంచిందని స్పష్టం చేశారు.
ఎంతమంది మరణించారనేది..
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు మరణించినట్లు పేర్కొన్నారు. ఎంతమంది మరణించారనే విషయాన్ని ఆర్మీ అధికారులు స్పష్టం చేయలేదు. ఈ దిశగా సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు వెల్లడించారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏకంగా కల్నల్ స్థాయి ర్యాంకు గల కమాండింగ్ అధికారి, ముగ్గురు జవాన్లు అమరులు కావడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
కదిలిన కేంద్రం
ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్తో సమావేశం అయ్యారు. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా ఇదే సమావేశానికి హాజరయ్యారు. సరిహద్దుల్లో ప్రాణనష్టానికి దారి తీసిన పరిణామాలపై చర్చిస్తున్నారు. చైనాపై ఎలాంటి వైఖరిని అనుసరించాలనే అంశంపై ప్రధానంగా వారి మధ్య చర్చకు వచ్చింది.
చర్చల నేపథ్యంలో..
గాల్వన్ వ్యాలీ, పెట్రోలింగ్ పాయింట్-15, హాట్ స్ప్రింగ్స్, ఫోర్ ఫింగర్స్ పాయింట్ వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. లఢక్ వద్ద నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ నెల 6వ తేదీన భారత్, చైనా మధ్య చర్చలు కొనసాగాయి. భారత్ తరఫున లేహ్లోని 14 కార్ప్స్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దక్షిణ గ్ఝిన్జియాంగ్ రీజీయన్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొన్నారు.
రెండు దఫా చర్చలపై సందిగ్ధత..
మరి కొద్దిరోజుల్లో రెండో దఫా చర్చలు కొనసాగాల్సి ఉంది. అదే సమయంలో రెండు దేశాల సరిహద్దు సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం ముగ్గురు మరణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండోదశ చర్చలపై అనుమానాలు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య ప్రాణనష్టాన్ని చవి చూసేంతటి స్థాయికి వెళ్లిన ఈ ఘర్షణల పర్యవసానం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. శాంతియుతంగా పరిష్కరించుకోవడంపైనే అటు చైనా, ఇటు భారత్ కట్టుబడి ఉన్నట్లు ఆయా దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Recommended Video
1975 తరువాత తొలిసారిగా..
భారత్ చైనా సరిహద్దులు రక్తమోడే పరిస్థితికి చేరుకోవడం 1975 తరువాత ఇదే తొలిసారి. అప్పట్లో కూడా చైనా సరిహద్దు వివాదాలను రేకెత్తించింది. దాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ చేసిన ప్రయత్నాలు అప్పట్లోనూ వ్యర్థం అయ్యాయి. ఫలితంగా రెండు దేశాల సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా ఆర్మీ తరచూ సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి అడుగు పెట్టడం.. వారిని మనదేశ జవాన్లు అడ్డుకోవడం.. వంటి చర్యలు 45 సంవత్సరాల కిందటే చోటు చేసుకున్నాయి. ఇన్నేళ్ల తరువాత కూడా అదే తరహా వాతావరణం నెలకొంది.