భారత్కు మరో గండం... కరోనా భయోత్పాతం నుంచి బయటపడకముందే మరో వైరస్ దాడి...
దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ కాస్త తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జనజీవనం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే భారత్ కరోనా గండాన్ని గట్టెక్కే అవకాశాలున్నాయి. కానీ ఇంతలోనే మరో పిడుగు లాంటి వార్త. చైనాలో ప్రబలుతున్న క్యాట్ క్యూ వైరస్ ఆనవాళ్లు భారత్లోనూ గుర్తించినట్లు ఐసీఎంఆర్ బాంబు పేల్చింది. భారత్లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తుల శాంపిల్స్లో ఈ వైరస్ యాంటీబాడీస్ గుర్తించినట్లు వెల్లడించింది.
అసలేంటీ వైరస్...
అర్బోవైరస్లలో ఒకటిగా పరిగణించే క్యాట్ క్యూ వైరస్(CQV) వైరస్ ద్వారా విపరీతమైన జ్వరం ( febrile illnesses), మెదడు వాపు (paediatric encephalitis), మెదడు సంబంధిత అనారోగ్య సమస్యలు (meningitis) తలెత్తుతాయి. చైనా,వియత్నాంలలో ఎక్కువగా పందులు,క్యూలెక్స్ దోమల ద్వారా ఇది వ్యాప్తి చెందుతోంది. ముందు జాగ్రత్తలో భాగంగా భారత్లోనూ ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించి ఐసీఎంఆర్ సీరం టెస్టులు నిర్వహిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 889 హ్యూమన్ సీరమ్ శాంపిల్స్ను సేకరించగా... అందులో ఇద్దరి శాంపిల్స్లో క్యాట్ క్యూ వైరస్ యాంటీబాడీస్ను గుర్తించింది.
ఆ ఇద్దరిలో యాంటీబాడీస్...
అయితే ఆ ఇద్దరిలో యాంటీబాడీస్(anti-CQV IgG) మాత్రమే బయటపడ్డాయి తప్ప వైరస్ను గుర్తించలేదని ఐసీఎంఆర్ పేర్కొనడం గమనార్హం. ఆ ఇద్దరూ కర్ణాటకకు చెందినవారని... ఒకరి శాంపిల్స్ 2014లో సేకరించగా,మరొకరి నుంచి 2017లో శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించింది. భారత్లో క్యాట్ క్యూ వైరస్ ప్రభావం గురించి అంచనా వేయాలంటే మరిన్ని శాంపిల్స్ను పరీక్షించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే భారత్లోని క్యూలెక్స్ దోమల్లో ఈ వైరస్ ఉనికికి అర్థం చేసుకోవడానికి మూడు భిన్న జాతులకు చెందిన దోమలపై పరిశోధనలు జరుపుతున్నట్లు పేర్కొంది.
Recommended Video
వాహకాలుగా ఆ దోమలు..
భారత్లోని aegypti,Cx.quinquefasciatus,Cx. tritaeniorhynchus జాతులకు చెందిన దోమలు క్యాట్ క్యూ వైరస్ వాహకాలుగా పనిచేసే అవకాశం ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది. ఈ దోమల ద్వారా అలాగే పందుల ద్వారా వైరస్ మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వైరస్ వ్యాప్తిలో పక్షులు,ఇతర జంతువుల పాత్రను ఐసీఎంఆర్ ఇంకా నిర్దారించలేదు. ఏదేమైనా కరోనా సృష్టించిన భయోత్పాతంతోనే ఇంకా విలవిల్లాడుతున్న దశలో మరో కొత్త వైరస్ దాడి తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.