ఫలితం రేపే: మూవీ చూసిన కేజ్రీ, అందుకు చాలా టైమ్ ఉందని బేడీ
న్యూఢిల్లీ: తమ పార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలియజేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ఆయన సినిమా చూశారు, కుటుంబ సబ్యులతో కొంత సేపు గడిపారు. మద్దతుదారుల వద్ద విక్టరీ సంకేతాలు ఇస్తూ సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఆదివాదం సాయంత్రం కేజ్రీవాల్ తన పార్టీ సహచరులు, కుటుంబ సభ్యులతో అక్షయ్ కుమార్ నటించిన థ్రిల్లర్ బేబీ సినిమాను తన ఇంటికి సమీపంలోని ఘజియాబాద్ కౌసాంబిలో గల మల్టీప్లెక్స్లో చూశారు.
వాలంటీర్లకు ఆయన ట్విట్టర్లో సందేశం పెట్టాడు. అద్భుతమైన పని చేశారు, రెండు రోజులు విరామం తీసుకోండి, మీ కుటుంబ సభ్యులతో గడపండి, సినిమాలు చూడండి, యోగా చేయండి అంటూ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్తో పాటు కుమార్ విశ్వాస్, మనిషీ సిసోడియా, సంజయ్ సింగ్ సినిమాకు వెళ్లారు. అక్కడ వారు అభిమానులతో ఫొటోలు దిగారు.
అయితే, తమకు విజయం దక్కి తీరుతుందనే విశ్వాసంతో బిజెపి ఉంది. బిజెపి ఆదివారంనాడు సమీక్ష నిర్వహించి, కార్యకర్తల నుంచి సమాచారం సేకరించింది. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీతో పాటు నాయకులు సతీష్ ఉపాధ్యాయ, ప్రభాత్ ఝా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సూక్ష్మ స్థాయిలో తాము విశ్లేషణ జరిపామని, తమ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఉపాధ్యాయ అన్నారు.
తాము కొన్ని సీట్ల ఫలితాల గురించి నిరీక్షించాల్సి ఉందని, మెజారిటీ చాలా తక్కువగా ఉంటుందని కిరణ్ బేడీ అన్నారు. ఫలితం ఎలా ఉన్నా బాధ్యత తనదేనని ఆమె అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సినిమా చూడడంపై ప్రతిస్పందిస్తూ అందుకు వారికి చాలా సమయం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికలపై బీజేపీ అభ్యర్ధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్లో వాస్తవం లేదని, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసం ఉందన్నారు. కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ మరికొన్నింటిలో ముందంజలో ఉన్నామన్నారు. ఎగ్జిట్ పోల్స్ గురించి ఆలోచించడం వ్యర్ధమని, ఈ నెల 10 వరకు వేచి చూడాల్సిందేనని బేడీ పేర్కొన్నారు.
నిద్రపోతూ కాంగ్రెసు నేతలు
కాంగ్రెసు అభ్యర్థులు ఆదివారంనాడు తమ కుటుంబ సభ్యులతో గడిపారు. కొంత మంది గాఢ నిద్రలో మునిగిపోయారు. కొంత మంది తమ పిల్లలతో, మనుమలూ మనవరాళ్లతో ఉల్లాసంగా గడుపుతూ కనిపించారు. కాంగ్రెసు ఎన్నికల ప్రచార సారథ్యాన్ని చేపట్టిన కాంగ్రెసు నేత అజయ్ మాకెన్ మాట్లాడుతూ - చాలా రోజుల తర్వాత తాను 8 గంటలు నిద్రపోయానని చెప్పారు. గత కొన్నాళ్లుగా రెండు మూడు గంటల నిద్రతోనే సరిపెట్టానని ఆయన చెప్పారు. ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఆదివారం నిద్రపోయానని ఆయన అన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను కాదనలేమని మాకెన్ అన్నారు. కాంగ్రెసు పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని ఆయన అంగీకరించారు.
8 గంటలకు లెక్కింపు ప్రారంభం
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితాలు అన్నీ వచ్చేస్తాయని భావిస్తున్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో 14 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈవిఎం ఓట్ల లెక్కింపు ఎనిమిదిన్నరకు గానీ ప్రారంభం కాదు.