‘ఏయ్, నేను లోకల్.. నన్నే డబ్బు కట్టమంటావా?..’, టోల్ ప్లాజా ఉద్యోగినిపై వాహనదారుడి వీరంగం!
న్యూఢిల్లీ: 'ఏయ్, నేను లోకల్.. నన్నే టోల్ ఫీజు కట్టమంటావా?' అంటూ ఓ ఉద్యోగినిపై ఓ వాహనదారుడు దాడి చేసిన ఘటన గుర్గావ్ ఎక్స్ప్రెస్ హైవేపై గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి.
గుర్గావ్ ఎక్స్ప్రెస్ హైవేపై ఉన్న ఖేర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడి బూత్ నంబర్ 23లో విధులు నిర్వహిస్తోన్న ఓ ఉద్యోగిని టోల్ ఫీజు చెల్లించమని అడిగిన పాపానికి ఓ వాహనదారుడు హంగామా సృష్టించాడు.
నేను లోకల్, నాకు టోల్ గీల్ ఏమీ ఉండదంటూ ఆ మహిళా ఉద్యోగిని దుర్భాషలాడాడు. అడ్డు వచ్చిన సిబ్బందిపై బూతు పురాణం విప్పాడు. చేయి లోపలికి చాచి ఆ మహిళా ఉద్యోగిని కొట్టాడు. అతడ్ని పట్టుకోవడానికి టోల్ ప్లాజా ఉద్యోగులంతా ముందుకు రావడంతో అక్కడ్నించి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
#WATCH: Man argues & attempts to beat a female toll plaza employee in #Gurugram pic.twitter.com/QlhYun3x3i
— ANI (@ANI) December 7, 2017
అయితే అక్కడి భద్రతా సిబ్బంది అతడి కారుకు అడ్డంగా బారికేడ్లు అడ్డుపెట్టడంతో చివరికి దొరికిపోయాడు. దీంతో వారు అతడ్ని పోలీసులకు అప్పజెప్పారు. ఆ కాసేపు ఆ వాహనదారుడు చేసిన హల్చల్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది.
నిజానికి ఖేర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదేం కొత్తకాదు. నవంబరు 18వ తేదీన కూడా ఇలాగే ఓ మహిళా ఉద్యోగినిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వేధింపులకు పాల్పడ్డారు.
ఓ ఎస్యూవీలో వచ్చిన ఆ వ్యక్తులు తాము అధికార బీజేపీకి చెందిన వారమని, వెంటనే బారికేడ్ పైకెత్తాలంటూ ఆ మహిళా ఉద్యోగినిపై జులుం ప్రదర్శించారని టోల్ ప్లాజా పీఆర్వో కృపాల్ సింగ్ తెలియజేశారు.
మరో ఘటనలో.. అక్టోబరు 3న రాత్రి 2 గంటల సమయంలో బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి టోల్ ప్లాజా ఉద్యోగులు టోల్ ఫీజు చెల్లించమని అడగ్గా వారిపై ఏకంగా కాల్పులే జరిపాడు. ఏదేమైనా ఈ టోల్ ప్లాజా వద్ద తరచూ గొడవలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.