పాక్ కుటిలనీతి: సరిహద్దు ఆవలి నుంచే కశ్మీర్లో ‘జిహదీ’ పునాదులు
కశ్మీరీ లోయలో పట్టు సాధించేందుకు దాయాది దేశం పాకిస్థాన్ అనుసరిస్తూ వచ్చిన పరోక్ష యుద్ధం నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నది. సరిహద్దుల ఆవల నుంచి జిహాదీలను పంపుతూ నిత్య మారణ హోమం స్రుష్టిస్తున్నది.
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలన నుంచి 70 ఏళ్ల క్రితం విముక్తి పొందిన భారత ఉపఖండంలో పెట్టిన చిచ్చు.. దేశ విభజన.. భవిష్యత్లో పట్టు కోసం.. భారత్, పాకిస్థాన్ దేశాల్లో కలవాలా? వద్దా? నిర్ణయించుకునే అధికారాన్ని సంస్థానాలకు అప్పగించినప్పుడు పెట్టిన చిచ్చు ఇప్పటికీ రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నది.
వలస పాలకులు స్వార్థం కల్పించిన రగడ.. కశ్మీరీలకు నరకం చూపుతున్నది. కశ్మీరీ లోయలో పట్టు సాధించేందుకు దాయాది దేశం పాకిస్థాన్ అనుసరిస్తూ వచ్చిన పరోక్ష యుద్ధం నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నది. సరిహద్దుల ఆవల నుంచి జిహాదీలను పంపుతూ నిత్య మారణ హోమం స్రుష్టిస్తున్నది.
అందుకు అవసరమైన ఆర్థిక, హార్థిక సహాయం అందజేస్తున్నది. ఐక్యరాజ్య సమితి వేదికగా ఒప్పందాలు కుదిరినా.. ఇరు దేశాల మధ్య నిత్యం ఒప్పందాలు జరిగినా.. మళ్లీ యధారీతిన ఉల్లంఘిస్తూ కశ్మీరీ లోయలో ప్రజల్లో నిత్యం అశాంతి రగులుస్తున్న పాకిస్థాన్.. తనదేశంలో అసంత్రుప్తిని పక్కదోవ పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నది.
ఇటీవల కశ్మీర్ లో పెరిగిన విధ్వంసం
ఇటీవలి కాలంలో ఈ విధ్వంసకాండ మరింత పెరిగింది. కశ్మీరీ ముస్లింలతో కలగలిసిపోయి.. హురియత్ కాన్ఫరెన్స్ తదితర వేర్పాటు వాద సంస్థలతో కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా అసమ్మతి రగిల్చేందుకు... అంతర్జాతీయ సమాజం ద్రుష్టిని ఆకర్షించేందుకు పాకిస్థాన్ సరికొత్త ఎత్తుగడలు అమలు చేస్తోంది.
భద్రతాదళాలపై స్థానికుల దాడులు
సరిహద్దు ఆవల నుంచి ఉగ్రవాదులను నిరోధించడంతోపాటు ఈవల శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతున్న భద్రతాబలగాలపై కశ్మీరీలు దాడులకు పాల్పడుతున్నారు. రాళ్లు రువ్వుతున్నారు. అయితే భద్రతాసంస్థల పొరపాట్లను వేర్పాటువాద సంస్థల నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. విద్యార్థులు.. విద్యార్థినులు కూడా రోడ్లపైకి వచ్చి భద్రతాబలగాలపై యదేచ్ఛగా రాళ్లు రువ్వుతున్నారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతూనే ఉన్నది.
విధ్వంసకాండ ఇలా
కానీ హింసాత్మక చర్యలతోపాటు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల దహనకాండ, ప్రజాప్రతినిధులు, భద్రతాదళాలపై కశ్మీరీలు రాళ్లు రువ్వడం వెనుక పాకిస్థాన్ పరోక్ష హస్తం ఉన్నదని రూడీగా తేలింది. భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హురియత్ కాన్ఫరెన్స్, తెహ్రీక్ - ఈ - హురియత్, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) వంటి వేర్పాటువాద సంస్థలకు సరిహద్దు ఆవల నుంచి యథేచ్ఛగా అవసరమైన ఆర్థిక సాయం లభిస్తున్నదని ఒక ఆంగ్ల టీవీ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో బయట పడింది.
పాక్ ఉగ్రవాద సంస్థలతోపాటు ఏజెంట్ల పాత్ర బట్టబయలు
దేశ రాజధాని హస్తినలో రహస్యంగా తల దాచుకున్న పాకిస్థాన్ ఏజెంట్లు తమకు నిధులు సమకూరుస్తారని వేర్పాటువాద సంస్థల నాయకులు అంగీకరించారు. అలజడి స్రుష్టిస్తేనే అస్థిరత ఏర్పడుతుందని నయీంఖాన్ వివరించారు. పాకిస్థాన్ నుంచి ఆర్థిక, హార్ధిక సాయం పొందుతూ కశ్మీరీ లోయలో హింసాత్మక, విధ్వంసక కార్యకలాపాలు నిర్వహించడంలో లష్కరే తాయిబా సహ వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ తదితర ఉగ్రవాద సంస్థల నేతల పాత్ర బయటపడింది.
సరిహద్దు ఆవల నుంచి నిధులు నిజమేనన్న వేర్పాటు సంస్థల నేతలు
హురియత్ కాన్ఫరెన్స్ ప్రొవెన్షియల్ అధ్యక్షుడు (జిలానీ గ్రూప్) నయీంఖాన్, తెహ్రీక్ ఈ హురియత్ నేత గాజీ జావెద్ బాబా, జేకేఎల్ఎఫ్ చైర్మన్ ఫరూఖ్ అహ్మద్ దార్ తదితరులు సరిహద్దు ఆవల నుంచి నిధులు అందుకుంటున్నామని సదరు చానెల్ స్టింగ్ ఆపరేషన్లో బయటపెట్టారు. మరో రూ.300 - రూ.400 కోట్ల నిధులు లభిస్తే కశ్మీర్లో మరో మూడు నెలల పాటు అస్థిరత సృష్టించేందుకు వీలవుతుందని కూడా సదరు వేర్పాటువాద నేత తెలిపారు. జేకేఎల్ఎఫ్ నేత ఫరూఖ్ అహ్మద్ దర్ కూడా పాక్ నుంచి నిధులు అందుకుంటామని అంగీకరించారు.
కశ్మీర్లో అస్థిరతకు పాక్ వందల కోట్ల ఖర్చు
దశాబ్దాలుగా కశ్మీర్లో అస్థిరత నెలకొల్పేందుకు పాక్.. వందల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నదని హురియత్ కాన్ఫరెన్స్ నేత నయీంఖాన్ చెప్పారు. ఢిల్లీలోని బల్లిమారన్, చాందినీచౌక్ ప్రాంతాల్లోని తమ సానుభూతి పరులు తమకు సహకరిస్తారని తెలిపారు. జమ్ము కశ్మీర్లో అంతర్జాతీయ నౌకాశ్రయాలు గానీ, విమానాశ్రయాలు గానీ లేనందున ఢిల్లీ కేంద్రంగానే తమకు వివిధ మార్గాల్లో ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా సరిహద్దు ఆవల నుంచి సాయం అందడం లేదన్నారు. తాము 35 స్కూళ్లు దహనం చేశామని, తమ మద్దతు లేకుండా ఇది జరుగదని కూడా అన్నారు. ఎమ్మెల్యేలపై రాళ్లు విసిరిన ఘటనలోనూ తమ ప్రాతినిధ్యం ఉన్నదని అంగీకరించారు. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, దహనాలకు పాల్పడే వారు హాస్పిటళ్లపై మాత్రం దాడికి పూనుకోవడం లేదు. తమకు గాయాలైతే కాపాడేది ఆస్పత్రులేనని నయీంఖాన్ తెలిపారు.
కథనం ప్రసారం నిలిపివేయాలని బెదిరింపులు
ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చిన నయీంఖాన్ భార్య హమీదాఖాన్.. టేపులు చూసి వెళ్లిపోయారని టీవీ చానెల్ తెలిపింది. ఈ అంశంపై టీవీ చానెల్లో వార్తాకథనం ప్రసారం కాగానే శ్రీనగర్లోని చానెల్ కార్యాలయానికి వచ్చిన నయీంఖాన్.. దీన్ని నిలిపివేయాలని హెచ్చరించారు. ఈ సంగతి తెలియగానే జమ్ముకశ్మీర్ డీజీపీ ఎస్పీ వాయిద్ సిబ్బందితో కలిసి ఇండియా టుడే కార్యాలయానికి వచ్చి అవసరమైన భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. ఇండియా టుడేలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా భద్రత కల్పిస్తామని డీజీపీ హామీనిచ్చారు.