టీఎంసీ నేతల అరాచకం: బీజేపీ మహిళా కార్యకర్తను తన్నుతూ, కర్రలతో దాడి(వీడియో)
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులతో రెచ్చిపోతున్నారు. మహిళ అని కూడా చూడకుండా అరాచకానికి పాల్పడ్డారు. మహిళ అనే కనీస గౌరవం లేకుండా రెండు సార్లు దాడి చేశారు.
ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక ఘటన పోలీసుల సమక్షంలోనే జరగగా.. మరో ఘటన మీడియా సాక్షిగా చోటుచేసుకోవడం గమనార్హం. అయినా నిందితులపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాకపోడం గమనార్హం.
ధర్నా చేస్తుండగా
ఆ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గత బుధవారం(సెప్టెంబర్ 26)న ఇద్దరు విద్యార్థుల హత్యకు నిరసనగా బీజేపీ రాష్ట్ర బంద్ నేపథ్యంలో దిసర్కార్ అనే మహిళా నేత తమ కార్యకర్తలతో కోల్కతాకు 40 కిలోమీటర్లో దూరంలో ఉన్న బారసత్లో రైల్రోకో నిర్వహించే ప్రయత్నం చేశారు.
టీఎంసీ నేతల అరాచకం
దీనిని అడ్డుకునేందుకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ నేత, ఆ పంచాయతీ ఛీఫ్ అర్షదుజ్జమాన్ సదరు మహిళపై దాడి చేశాడు. కర్రలతో ఆమెను కొడుతూ ఒక తన్ను తన్ని పరుగెత్తించాడు. ఆమెపై దాడి చేస్తున్న సమయంలో పక్కనే పోలీసులు ఉన్నప్పటికీ చూస్తూ ఉండిపోయారే తప్ప అతడ్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.
పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప..
ఈ ఘటననంతా ఒకరు సెల్ఫోన్లో రికార్డ్ చేశారు. ఇక ఈ దాడి గురించి ఆమెను ఓ మీడియా రిపోర్టర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరోసారి ఆమెపై మీడియా సాక్షిగానే దాడి చేశారు. అర్షదుజ్జమాన్ సహాయకుడు కుతుబుద్దిన్ ఆమెను తన్నుతూ.. కాళ్లు చేతులు కట్టేసి రోడ్డుపై విసిరేశాడు. ఇతర బీజేపీ కార్యకర్తలను కూడా కర్రలతో చితకబాదారు. పోలీసులు ఘటనా స్థలంలోనే ఉన్నా చూస్తూ ఉండిపోయారు.
మమతా సర్కారుపై విమర్శలు
ఈ వీడియోలు వైరల్ కావడంతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఎంసీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటి వరకు టీఎంసీ గానీ, మమతా బెనర్జీ గానీ స్పందించలేదు. విపక్షాలపై మమతా సర్కారు దారుణంగా వ్యవహరిస్తోందంటూ వివిధ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.