కర్ప్యూ అయితే ఏంటి: పెళ్లి వేదిక రాష్ట్రం దాటింది
బెంగళూరు/తిరువణ్ణామలై: కావేరీ జలాల వివాదం నేపధ్యంలో బెంగళూరులో జరగాల్సిన పెళ్లి తమిళనాడుకు మారింది. కావేరీ చిచ్చు కారణంతో బెంగళూరులోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.
కర్ఫ్యూ కారణంతో బెంగళూరులో జరగాల్సిన పెళ్లికి తమిళనాడు వేదిక అయ్యింది. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన రంజిత్ (25) బెంగళూరు చేరుకుని శ్రీరాంపుర సమీపంలో నివాసం ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
తిరువణ్ణామలైకి చెందిన సౌమ్య (23)తో రంజిత్ పెళ్లి నిశ్చయించారు. సెప్టెంబర్ 14వ తేది బుధవారం బెంగళూరులోని శేషాద్రిపురంలోని ఓ కళ్యాణమంటపంలో పెళ్లి చెయ్యడానికి అన్నీ సిద్దం చేశారు. పెళ్లి పత్రికలు ముద్రించి బెంగళూరు, తమిళనాడులోని బంధువులకు పంచిపెట్టారు.
సోమవారం ఉదయం సౌమ్య తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు చేరుకుంది. అయితే అదే రోజు కావేరీ జలాల పంపిణి విషయంలో బెంగళూరులో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఆందోళనలో హింస చోటుచేసుకుంది.
పెళ్లి జరగాల్సిన ప్రాంతంలో, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఉన్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే బెంగళూరులో పెళ్లి చెయ్యడం సాధ్యం కాదని సౌమ్య, రంజిత్ కుటుంబ సభ్యులు భావించారు.
ముందుగా నిర్ణయించిన రోజే పెళ్లి చేసుకోవాలని రంజిత్, సౌమ్య నిర్ణయించారు. అంతే బుధవారం అన్నీ సర్దుకుని బెంగళూరు నగరం నుంచి బీఎంటీసీ బస్సులలో కర్ణాటక- తమిళనాడు శివార్లలోని అత్తిబెలె వరకు వెళ్లారు.
తరువాత అత్తిబెలె నుంచి రెండు కిలోమీటర్లు పెళ్లి దుస్తుల్లోనే రంజిత్, సౌమ్య వారి కుటుంబ సభ్యులు నడుచుకుంటూ వెళ్లి తమిళనాడులోకి ప్రవేశించారు. అక్కడి నుంచి సిటీ బస్సులో హౌసూరు చేరుకున్నారు.
తరువాత హోసూరు నుంచి తిరువణ్ణామలై చేరుకుని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. బుధవారం బెంగళూరు నగరంలో కర్ఫ్యూ ఎత్తివేశారు. అయితే అప్పటికే వీరు తమిళనాడులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు.