కావేరి సెగ: రెండు రాష్టాల్లో కూరగాయల ధరలు డమాల్
బెంగళూరు/చెన్నై: కావేరీ జలాల వివాదం విషయంలో కర్ణాటక, తమిళనాడులో జరిగిన ఆందోళన కారణంగా రైతులు, వ్యాపారులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. కూరగాయాల రేట్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో రైతులు, వ్యాపారులకు కోలుకోలేని దెబ్బపడింది.
రెండు రాష్ట్రాల్లో ఆందోళనలు, బంద్ కారణంగా కూరగాయల రేట్లు కుప్పకూలిపోయాయి. కర్ణాటకలో పండించి తమిళనాడుకు సరఫరా చేసిన కూరగాయల రేట్లు గత వారంతో పోల్చితే 50 శాతం కుప్పకూలిపోయాయి.
అదేవిధంగా తమిళనాడులో పండించి కర్ణాటకకు సరఫరా చేసిన కూరగాయల రేట్లు 40 శాతం పెరిగాయని రీటైల్ వ్యాపారులు అంటున్నారు. కూరగాయలతో పాటు పాలు, పెరుగు, కోడిగుడ్ల సరఫరా నిలిచి పోవడంతో వ్యాపారులు దెబ్బతిన్నారు.
కర్ణాటకలో పండించిన క్యాప్సీకం, టమోటా, ఉల్లిపాయలు, క్యాబేజ్ తదితర కూరగాయల రేట్లు ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడులో భారీగా పడిపోయాయి. గతవారం క్యాప్సీకం కేజీ రూ. 28 విక్రయిస్తే ఇప్పుడు రూ. 12 విక్రయిస్తున్నారు.
గతవారం ఉల్లిపాయలు హోల్ సేల్ మార్కెట్ లో కేజీ రూ. 20 నుంచి రూ. 22 వరకు విక్రయించారు. ఇప్పుడు కేజీ రూ. 8 పడిపోయింది. టమోటా 10 కేజీల బాక్స్ గతవారం రూ. 300 కు విక్రయించారు. ఇప్పుడు 10 కేజీల బాక్స్ రూ. 100 నుంచి రూ.150 విక్రయిస్తున్నారు.
టమోట ప్రస్తుతం కేజీ రూ.10 విక్రయిస్తున్నారు. టమోట ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. అదేవిధంగా పూల ధరలు భారీగా పడిపోయాయి. మార్కెట్లు మూతపడటంతో పూలు సరఫరా చెయ్యలేక వాటిని చెట్లలోనే వదిలేశారు.
తమిళనాడు నుంచి కర్ణాటకకు అక్కడి నుంచి ఇక్కడికి వాహనాలు సంచరించకపోవడంతో పాల వ్యాపారులు నష్టపోయారు. ముఖ్యంగా నీలగిరీస్, ఆరోక్య కంపెనీలకు చెందిన పాలు సరఫరా కాకపోవడంతో నష్టపోయారు.
పాలు సరఫరా కాకపోవడంతో బెంగళూరులో 30 నీలగిరీస్ శాఖలు మూసివేశామని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. చెన్నై ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఆరోక్య కంపెనీ సైతం పాలు సేకరించలేక, సరఫరా చెయ్యలేక నష్టపోయామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
మైసూరు నగరంలో నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలకు కోడిగుడ్లు సరఫరా చేసేవారు. అయతే కావేరీ చిచ్చు కారణంగా కోడిగుడ్లు సరఫరా నిలిపి వేయడంతో వ్యాపారులు నష్టపోయారు.