కావేరీ చిచ్చు: విజయకాంత్కు అస్వస్థత, భార్య ప్రేమలత దీక్ష
చెన్నై: కావేరీ జలాల వ్యవహారంలో కర్నాటక వైఖరిని నిరసిస్తూ నిరాహార దీక్ష చేపడతానని ప్రముఖ నటుడు, డిఎండికె అధినేత విజయకాంత్ మూడు రోజుల క్రితం ప్రకటించారు. అయితే, ఆయన నిరాహార దీక్ష చేపట్టలేదు. దీంతో, ఆయన దీక్ష చేపడతానని చెప్పి మాయమయ్యాడని వార్తలు వచ్చాయి
కానీ, విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు బదులుగా ఆయన సతీమణి, డీఎండీకే మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రేమలత దీక్ష చేపట్టారు.
డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఒక్కరోజు పాటు దీక్ష చేపడతానని తొలుత విజయకాంత్ ప్రకటించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి దీక్షకు దిగాల్సి ఉంది. ఆయనకు బదులుగా ప్రేమలత దీక్షబూనారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. కొద్దిరోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం విజయకాంత్ పలు జిల్లాల్లో పర్యటించడంతో అనారోగ్యానికి గురయ్యారని, నిరాహారదీక్ష చేస్తే ఆరోగ్యం మరింత విషమిస్తుందని వైద్యులు చెప్పడంతో ఆయన దీక్షకు రాలేకపోయారన్నారు. తమిళుల ఆగ్రహావేశాలను రెచ్చగొట్టేలా కన్నడిగులు వ్యవహరిస్తున్నారన్నారు. కర్ణాటకతో పాటు ఏపీ, కేరళ రాష్ట్రాలు కూడా తమిళులకు ద్రోహం తలపెడుతున్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలన్నారు.