కావేరి వివాదంపై కర్ణాటక కొత్త వాదన : 'బాకీ కింద రాసేసుకోండి!'
బెంగుళూరు : కావేరి జల వివాదానికి సంబంధించి కర్ణాటక చేసిన కొత్త ప్రతిపాదన విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉన్న ఈ కేసుకు సంబంధించి కర్ణాటక చేస్తోన్న కొత్త వాదన ఏంటంటే.. తమ వద్ద నీరు ఉన్నప్పుడే తమిళనాడుకు నీటిని విడుదల చేస్తామని, అంతదాకా బాకీ కింద దాన్ని జమకట్టాలని పేర్కొంటున్నది.
కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాల్సిందిగా సుప్రీం స్పష్టం చేసిన నేపథ్యంలో.. మరోసారి సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది కర్ణాటక. అందులో ఈ కొత్త ప్రతిపాదనను పొందుపరిచింది. సుప్రీం తీర్పు మేరకు తమిళనాడు నీటి విడుదల సాధ్యం కాదని వాదిస్తూ.. కావాలంటే విడుదల చేయాల్సిన నీటిని బాకీ కింద జమకడితే, డిసెంబర్ నాటికి విడుదల చేస్తామని చెబుతోంది కర్ణాటక.
అయితే రాబోయే రోజుల్లో నమోదయ్యే వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని, వరద నీటిని తమిళనాడును విడుదల చేయాలనే ఆలోచనలో కర్ణాటక ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 6వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలంటూ సుప్రీం కర్ణాటకను ఇదివరకే ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటక చేసిన ఈ ప్రతిపాదనపై పలువురు నోరెళ్లబెడుతున్నారు. నీటి లెక్కలను కూడా బాకీ కింద జమకట్టాలని కోరడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.