ప్రధాని మోడీ, మాజీ పీఎం దేవేగౌడకు థ్యాక్స్: కర్ణాటక
బెంగళూరు: కావేరీ జలాల వివాదానికి సంబంధించి సెప్టెంబర్ 30వ తేది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించడానికి అక్టోబర్ 3వ తేది సోమవారం కర్ణాటక ప్రత్యేక శాసన సభ సమావేశం నిర్వహించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడకు ప్రత్యేక శాసన సభ సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు. కావేరీ జలాల పంపిణి విషయంలో ప్రధాని మోడీ, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ కర్ణాటకకు సహకరించారని ధన్యవాదాలు తెలిపారు.
కావేరీ నదీ జలాలు పంపిణి చెయ్యడానికి కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు. తరువాత మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (బీజేపీ) జగదీష్ శెట్టర్ మాట్లాడారు.
కావేరీ జలాల పంపిణి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి వివరించారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని ఆదేశించడం సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ వ్యాప్తికి రాదని అన్నారు.
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చిందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన వివరణపై అటర్నరీ జనరల్ ముకుల్ సుప్రీం కోర్టుకు అర్జీ సమర్పించారని జగదీష్ శెట్టర్ తెలిపారు.
అందువలన శాసన సభ సాక్షిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని హెచ్.డీ.దేవేగౌడకు అఖిల పక్ష శాసన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. తరువాత మాజీ స్పీకర్, కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి రమేష్ కుమార్ మాట్లాడారు.
మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని, ఆయన పార్టీలకు అతీతంగా కన్నడ ప్రజలకు సేవ చెయ్యాలని, ఆయన సలహాలు కన్నడిగులకు చాల అవసరం అని మంత్రి రమేష్ కుమార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యుడు బీ.ఎస్. యడ్యూరప్ప సోమవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండటం వలనే కావేరీ జలాల సమస్య ఎక్కువ అయ్యిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వలన ఇంత రాద్దాంతం జరిగిందని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వలనే కావేరీ జలాల పంపిణి వివాదం ఓ కొలిక్కివస్తుందని బీ.ఎస్. యడ్యూరప్ప వివరించారు.