కావేరీ బోర్డు: తమిళనాడుకు న్యాయం చేస్తాం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కావేరీ జలాల విషయంలో తమిళనాడు రాష్ట్రానికి న్యాయం చేస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం నాడు హమీ ఇచ్చింది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆరువారాల గడువును ఇచ్చింది. అయితే కోర్టు ధిక్కారానికి కేంద్రం పాల్పడిందని ఆరోపిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో శనివారం నాడు పిటిషన్ దాఖలు చేసింది.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం నాడు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణను చేపట్టింది. తమిళనాడు రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం హమీ ఇచ్చింది.
తమిళనాడు రాష్ట్ర సమస్య తమకు తెలుసునని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సమస్యను అర్ధం చేసుకొన్నట్టు సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కావేరీ జలాల విషయంలో సత్వరం న్యాయం జరిగేలా చూస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తెలిపారు.
కావేరీ జలాల విషయంలో విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కావేరీ బోర్డు ఏర్పాటు విషయమై అన్నాడిఎంకె ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు.
కావేరీ బోర్డు ఏర్పాటు విషయమై కేంద్రం స్పందించింది. ఇది చాలా సున్నితమైన అంశమని ప్రకటించింది. కర్ణాటకలో ఎన్నికలు ఉన్నందున నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది.