కావేరి వివాదానికి ఆజ్యం పోస్తోన్న 'అమ్మ పోస్టర్' : అప్పుడలా..? ఇప్పుడిలా?
చెన్నై : కావేరి జలాల వివాదం తమిళనాడు కర్ణాటక మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిని తీసుకొచ్చింది. నదీ జలాల విడుదలకు సంబంధించి తమిళనాడుకు సానుకూలంగా సుప్రీం తీర్పును వెలువరించిన నేపథ్యంలో.. ఓ పాత విషయాన్ని తిరగదోడుతూ తమిళనాడును టార్గెట్ చేశారు కర్ణాటక ప్రజలు.
ఇంతకీ ఏంటా విషయమంటే.. విషయమంతా ఓ పోస్టర్ తో ముడిపడి ఉన్నదే. 2014లో ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న అభియోగం మీద తమిళనాడు సీఎం జయలలితకు బెంగుళూరు ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో బెంగుళూరు కోర్టు తీర్పుపై తీవ్ర నిరసనలను వ్యక్తం చేస్తూ.. రోడ్ల పైకి వచ్చారు అమ్మ అభిమానులు.
రాస్తారోకోలు, ఆందోళనలు, నిరాహార దీక్షలతో హోరెత్తించారు. అయితే కొంతమంది అభిమానులు మరో అడుగు ముందుకేసి.. 'కావేరీయై వెచ్చుకో..అమ్మవై కొడు-అమ్మా వా' (కావేరీని ఉంచుకో...అమ్మను మాకిచ్చేయి-అమ్మా రా) అంటూ కొన్ని పోస్టర్లను ముద్రించారు. జైలు శిక్ష విధించిన సదరు న్యాయమూర్తిని పోస్టర్ల ద్వారా విమర్శించారు.
ఇప్పుడిదే పోస్టర్ ను తెర పైకి తెచ్చి తమిళనాడు జనానికి ప్రశ్నలను ఎక్కుపెడుతున్నారు కర్ణాటక జనం. 'అప్పుడేమో కావేరీ నది జలాలు వద్దు.. అమ్మను మాత్రం వదిలేయండంటూ పోస్టర్లు ముద్రించిన మీరు.. ఇప్పుడు మళ్లీ కావేరీ జలాలు కావాలంటూ మాట మార్చడం ఎంతవరకు సమసంజసం' అంటూ నిలదీస్తున్నారు. కర్ణాటక ప్రజలు చేస్తోన్న ఆందోళనలో భాగస్వామ్యులైన అన్నాడీఎంకే నేతలు కూడా ఇదే పోస్టర్ ను జయలలితపై అస్త్రంగా వాడుకుంటున్నారు. మొత్తానికి కావేరీ వివాదానికి అమ్మ పోస్టర్ మరింత ఆజ్యం పోసేలాగే కనిపిస్తోంది.