ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ట్విస్ట్: చిదంబరం సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న సీబీఐ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రం మంత్రి చిదంబరం సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఢిల్లీ హైకోర్టులో సీబీఐ తరపున వాదనలు వినిపించారు అడిషనల్ సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా. ఐఎన్ఎక్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంద్రాణీ ముఖర్జీని జైలులో చిదంబరం కలిశారు. అయితే ఆ సమయంలో జైలు రిజిస్టర్లో చిదంబరం సంతకం చేశారని ఇప్పుడు ఆ రిజిస్టర్ కనిపించడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు తుషార్ మెహతా.
ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఇంద్రాణీ ముఖర్జీకి మేలు చేసేందుకు చిదంబరం తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ముఖర్జీని కలిసిన సమయంలో ఆ నాటి జైలు రిజిస్టర్ అదృశ్యమైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన తుషార్ మెహతా... చిదంబరం సాక్షాలను ట్యాంపర్ చేస్తున్నారని చెప్పారు. విచారణలో భాగంగా చిదంబరం ఇంద్రాణీ ముఖర్జీని జైలులో కలిశారని తుషార్ మెహతా వాదించారు.
చిదంబరంకు ఇంద్రాణీ ముఖర్జీకి సంబంధం ఉన్నట్లు లేదా ఆయన ఇంద్రాణీ ముఖర్జీని కలిసినట్లు చెప్పేందుకు రుజువులు ఏమైనా ఉన్నాయా అని చిదంబరం తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ప్రశ్నించగా చిదంబరం సాక్షాలను ధ్వసం చేశారని సమాధానంగా తుషార్ మెహతా చెప్పారు. ఇంద్రాణీ ముఖర్జీని తాను కలిసినట్లుగా గుర్తుకు లేదని, ఒక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తిని కొన్ని వందల మంది వచ్చి కలుస్తారని అందులో ఎవరని గుర్తుపెట్టుకుంటామని చిదంబరం మాటగా కపిల్ సిబాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ ఎదుర్కొంటున్న చిదంబరంను సీబీఐ సెప్టెంబర్ 5న అరెస్టు చేసింది. ఆయన్ను విచారణ చేసేందుకు కస్టడీ కోరగా ఢిల్లీ ప్రత్యేక కోర్టు చిదంబరంను తీహార్ జైలుకు తరలించింది. ఇప్పటికే చిదంబరం తనపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని పలుమార్లు ఆయన పేరుమీదుగా తన కుటుంబ సభ్యులతో ట్వీట్ చేయించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పుతున్న నేపథ్యంలో తాను ప్రశ్నిస్తున్నందునే తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనను జైలులో ఉంచిందని చిదంబరం అన్నారు. అయితే బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ చిదంబరంకు బెయిల్ మంజూరు చేయలేదు ప్రత్యేక కోర్టు.