చిక్కుల్లో సీఎం రమేష్ : సీబీఐ విచారణకు పిలువదని టీడీసీ ఎంపీ హామీ ఇచ్చారన్న సతీష్
స్వయంప్రతిపత్తి కలిగిన విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐలో కూడా అవినీతి చేపలు బయటపడుతున్నాయి. ఇప్పటికే టాప్ బాస్ రాకేష్ అస్తానా చుట్టూ ఉచ్చు బిగుస్తుండగా తాజాగా సీబీఐ డిపార్ట్మెంట్ అందులో పనిచేసే డీఎస్పీ దేవేందర్ కుమార్ను అరెస్టు చేసింది. మాంసం ఎగుమతి దారుడు మోయిన్ ఖురేషీ కేసులో విచారణాధికారిగా ఉన్న దేవేందర్ కుమార్ ...ఖురేషీని కేసునుంచి తప్పించేందుకు తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సీబీఐ గుర్తించింది.
లంచం కేసులో సీబీఐ అధికారుల వార్: రంగంలోకి ప్రధాని నరేంద్ర మోడీ
తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు
కేసుకు సంబంధించి సతీష్ సానా అనే వ్యాపారస్తుడి స్టేట్మెంట్ను సెప్టెంబర్ 26,2018లో కావాలనే రికార్డు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు విచారణాధికారిగా రాకేష్ ఆస్తానా ఉన్నారు. గతంలో సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మకు లంచం ఇచ్చినట్లు సతీష్ సానా స్టేట్మెంట్ ఇచ్చినట్లు దేవేందర్ కుమార్ విచారణ చేసి నివేదికలో పొందుపర్చారు. ఇదిలా ఉంటే తను ఆ స్టేట్మెంట్ అసలు ఇవ్వలేదని సతీష్ చెబుతున్నాడు.
కేసులో ఇక సమన్లు రావని సీఎం రమేష్ హామీ ఇచ్చాడు
స్టేట్మెంట్ రికార్డు చేసినట్లుగా చెబుతున్న రోజున సతీష్ సానా వ్యక్తి హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం. సానా ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కేసుకు సంబంధించి తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ నాయుడుతో ఈ ఏడాది జూన్లో చర్చించినట్లు చెప్పారు. సీఎం రమేష్ సీబీఐ డైరెక్టర్తో మాట్లాడారని ఇకపై తనకు ఎలాంటి సమన్లు రావని సీఎం రమేష్ తనకు హామీ ఇచ్చినట్లు సతీష్ సానా తెలిపారు. ఇక జూన్ నుంచి సీబీఐ తనను విచారణ పేరుతో పిలువలేదని స్పష్టం చేశాడు. తనపై పూర్తిస్థాయిలో విచారణ ముగిసిందనే భావనలోనే తాను ఉన్నానని సతీష్ తెలిపాడు.
ప్రధాని ముందుకు సీబీఐ ఉన్నతాధికారుల పంచాయతీ
సతీష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ మరో నిర్ధారణకు వచ్చింది. డీఎస్పీ దేవేంద్రకుమార్ ఉద్దేశపూర్వకంగానే స్టేట్మెంట్ రికార్డుచేయడం ద్వారా రాకేష్ ఆస్తానా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై చేసిన పసలేని ఆరోపణలకు బలం చేకూర్చేందుకే ఈ పని చేసినట్లు నిర్ధారించింది సీబీఐ. అంతేకాదు ఈకేసుకు సంబంధించి ఇంకా విచారణ చేసిన ఇతర అధికారులను కూడా సీబీఐ విచారణ చేస్తోంది. ఇద్దరి సీబీఐ ఉన్నతాధికారుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరడంతో పంచాయతీ ప్రధాని ముందుకు చేరింది. తక్షణమే ఇద్దరు అధికారులు ప్రధాని కార్యాలయానికి రావాల్సిందిగా పిలుపు అందింది. దేశంలో తొలిసారిగా సీబీఐ బాగోతం రోడ్డుకెక్కింది.