సీబీఐలో లంచం...దేశంలోనే సంచలనం:తమ అధికారి రాకేశ్ అస్థానాపైనే సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ:భారత దేశ చరిత్రలోనే ఇది ఒక సంచలనం. దేశంలో అవినీతి, అక్రమాలను వెలికితసి దర్యాప్తు జరిపే అత్యున్నత సంస్థ సీబీఐనే అత్యంత తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది.
సీబీఐలో అత్యున్నత స్థాయి అధికారులు ఇద్దరు కరప్షన్ కేసులను కొట్టేయించేందుకు కోట్లాది రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణల నడుమ ఒక చివరకు ఒక సిబిఐ స్పెషల్ డైరెక్టర్ మీదే కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. పైగా ఆ వ్యక్తిని ప్రధాని మోడీ గుజరాత్ నుంచి ఏరి కోరి తెచ్చి సిబిఐలో నంబర్ 2 స్థానంలో కూర్చోబెట్టిన అధికారి కావడమే పెనుదుమారం రేపుతోంది. వివరాల్లోకి వెళితే...
సిబిఐ నంబర్ 2పై...కేసు నమోదు
తీవ్రమైన నేరారోపణలతో సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై సాక్షాత్తూ సిబిఐనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు నమోదు ఈ నెల 15 న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీపై మనీలాండరింగ్ కేసు వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన వ్యాపారి సతీష్ సనాను వేధించకుండా ఉండేందుకు ఆయన రూ 3. కోట్లు లంచం తీసుకున్నారనేది ఆయనపై ప్రధాన ఆరోపణ. మొత్తం రూ.5 కోట్లు డిమాండ్ చేయగా నిందితుడి తరుపు వ్యక్తులు రూ.3 కోట్లు పుచ్చుకున్నారనేది ఆరోపణల సారాంశం.
800కి.మీ. ప్రయాణించి పిజ్జా డెలివరీ చేసిన రెస్టారెంట్ ఉద్యోగి, ప్రశంస: ఎందుకంటే, కారణం ఇదే
మనీ లాండరింగ్ కేసులో...లంచం
హైదరాబాద్ వ్యాపారి సతీశ్ సనా మనీలిండరింగ్ కేసులో తన పేరు బయటకు రాకుండా చూసేందుకు దుబాయిలో ఉండే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మనోజ్ ప్రసాద్ ద్వారా 10 నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని ముట్టజెప్పారట. ఈ మేరకు సతీశ్ సనా నుంచి సిబిఐ ఫిర్యాదు స్వీకరించి తమ శాఖ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఖురేషీ మనీల్యాండరింగ్ కేసుపై అస్థనా నేతృత్వంలోని సిట్ దర్యాప్తు జరుపుతుండటం గమనార్హం. లక్నోకు చెందిన మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్లు మనీల్యాండరింగ్ కేసు సెటిల్ మెంట్ వ్యవహారంలో మధ్యవర్తులుగా ఉన్నారని తెలిసింది.
ముడుపుల స్వీకరణ...ఇలా
ఈ నేపథ్యంలో తాను మూడు కోట్లు స్వీకరించింది నిజమేనని, అయితే ఆ డబ్బు తీసకుంది అస్థానా కోసమేనని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మనోజ్ ఒక మెజిస్ట్రేట్ సమక్షంలో అంగీకరించినట్లు సీబీఐ వెల్లడించింది. రాకేశ్ అస్థానాకు లంచంగా ఇవ్వాల్సిన ముడుపుల వాయిదా సొమ్మును తీసుకునేందుకు అక్టోబరు 16న దుబాయి నుంచి వచ్చిన మనోజ్ ప్రసాద్ను సీబీఐ అరెస్టు చేసింది. ఖురేషీని ఈడీ గత ఏడాది ఆగస్టులోనే అరెస్టు చేసింది. ఇదే కేసు ఎఫ్ఐఆర్లో అస్థానాతో పాటు భారత గూఢచార సంస్థ ‘‘రా''లో నెంబర్ టూగా ఉన్న గల్ఫ్ వ్యవహారాల ప్రతినిధి, స్పెషల్ డైరెక్టర్ సామంత్ కుమార్ గోయల్ పేరు కూడా ఉందని సమాచారం.
వేధింపులు...నిజమేనట
అయితే ప్రస్తుతానికి ఆయనని నిందితుడిగా పేర్కొనలేదని తెలిసింది. గోయల్ తరచూ దుబాయిలో ఖురేషీని కలిసేవారని, అస్థానాతో టచ్లో ఉండేందుకు సాయం చేశారని మనోజ్ ప్రసాద్ సీబీఐకి తెలిపారు. ఇదిలావుంటే సీబీఐ అధికారులు లంచం కోసం తనను తీవ్రంగా వేధించే వారని సతీశ్ సనా వెల్లడించినట్లు తెలిసింది. అయితే గతంలోనూ ఖురేషీ నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతోనే అప్పటి సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ అవమానకర పరిస్థితుల్లో 2014లో పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. తాజాగా ఖురేషీ కేసులోనే స్పెషల్ డైరెక్టర్ అస్థానా అడ్డంగా బుక్ అయిపోవటం విశేషం.
అంతర్గత కలహాల...నేపథ్యం
అయితే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు మొదటి నుంచీ పడటం లేదని, ఈ నేపథ్యంలోనే ఖురేషీ కేసుకు సంబంధించి అలోక్ వర్మ ముడుపులు తీసుకున్నారంటూ తొలుత రెండు నెలల క్రితం రాకేష్ అస్థానానే కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. అయితే చివరకు అదే కేసులో రివర్స్ గా ఆయనే అదే ఆరోపణతో కేసులో ఇరుక్కున్నారు. అలాగే ఇదే కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దేవేందర్ పై కూడా కేసు నమోదైంది. అయితే డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ, ఈడీల్లోని మరికొందరు అధికారులు కలిసి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే సతీశ్ సనాతో ఫిర్యాదు చేయించారని అస్థానా ఆరోపిస్తున్నారు. అయితే చివరకు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.