హత్రాస్ గ్యాంగ్ రేప్... చార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడించిన సీబీఐ...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో సీబీఐ శుక్రవారం(డిసెంబర్ 18) చార్జిషీట్ దాఖలు చేసింది. బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. నిందితులైన సందీప్,రవి,రాము,లవకుష్ అనే నలుగురు యువకులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు, సెక్షన్ 376డీ కింద అత్యాచారం,సెక్షన్ 302 కింద హత్య అభియోగాలను మోపింది. ఈ మేరకు స్థానిక కోర్టులో సీబీఐ చార్జిషీట్ను దాఖలుపరిచింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు ఈ చార్జిషీట్ను దాఖలు చేశారు.
సెప్టెంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత(బోయ) సామాజికవర్గానికి చెందిన 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. గడ్డి కోసుకొచ్చేందుకు పొలానికి వెళ్లిన ఆ యువతిని.. అగ్ర కులాలకు చెందిన నలుగురు యువకులు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఎక్కడ తమ పేర్లు బయటపెడుతుందేమోనన్న భయంతో ఆమె నాలుక కూడా కోసేశారు.
అప్పటికే కుమార్తె కోసం వెతుకుతున్న ఆ కుటుంబం ఆమెను ఆ స్థితిలో చూసి షాక్ తిన్నది. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ మొదట పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అటు పోలీసులు కూడా అత్యాచార ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు విన్నాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు సెప్టెంబర్ 29న మరణించింది.
అదే రోజు రాత్రికి రాత్రి కుటుంబ సభ్యులను సైతం అనుమతించకుండా పోలీసులు,స్థానిక అధికారులు మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల ప్రాథమిక హక్కులను పోలీసులు,అధికారులు కాలరాశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తల్లిదండ్రులకు కడసారి చూపు కూడా దక్కనివ్వకపోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును యోగి సర్కార్ సీబీఐకి అప్పగించింది. ఘజియాబాద్ బ్రాంచ్కి చెందిన సీబీఐ అధికారులు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.