పీఎన్బీ స్కాంలో కీలక పరిణామం: నీరవ్ మోడీపై తొలి ఛార్జీషీటు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్బీ స్కాంకు సంబంధించి ప్రధాన నిందితుడు నగల వ్యాపారి నీరవ్ మోడీ, బ్యాంక్ అధికారులు, ఇతర సిబ్బందిపై సీబీఐ తొలి ఛార్జీషీటును నమోదు చేసింది.
ముంబై కోర్టులో ఈ ఛార్జీషీటును దాఖలు చేసింది. పీఎన్బీ మాజీ ఎండీ, సీఈఓ, ప్రస్తుతం అలహాబాద్ బ్యాంకు సీఎండీ ఉషా అనంత సుబ్రమణియన్, తదితర టాప్ అధికారులపై అభియోగాలు నమోదు చేసింది. సుమారు 400కోట్ల రూపాయల తప్పుడు ఎల్ఓయూలు జారీ చేశారని సీబీఐ తన ఛార్జీషీటులో పేర్కొంది.
Recommended Video
కాగా, 2011-18 సంవత్సరాల మధ్య పీఎన్బీ స్కాం చోటుచేసుకోగా, ఉషా సుమారు 21నెలలపాటు పీఎన్బీకి సీఎండీగా వ్యవహరించారు. 2016లో పీఎన్బీ సీఎండీగా ఉన్న అనంత సుబ్రమణియన్ స్విఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీటులో పీఎన్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బ్రహ్మాజీ రావు, సంజీ శరణ్ లతోపాటు జనరల్ మేనేజర్ నెహల్ అహాద్ తదితరుల పేర్లను చేర్చినట్లు తెలుస్తోంది.